అధికారంలోకి వచ్చాక ఏపీలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రారంభించిన సీఎం జగన్.. తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. అదే వైఎస్ఆర్ లా నేస్తం. ఈ
అధికారంలోకి వచ్చాక ఏపీలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రారంభించిన సీఎం జగన్.. తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. అదే వైఎస్ఆర్ లా నేస్తం. ఈ స్కీమ్ కింద లబ్దిదారులైన జూనియర్ లాయర్లకు ప్రభుత్వం ప్రతి నెల రూ.5వేలు స్టైఫండ్ ఇస్తుంది. జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3న ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
‘వైఎస్ఆర్ లా నేస్తం’ పథకం ప్రకారం కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరత్వం పొందే వరకు.. అంటే మూడేళ్ల పాటు నెలకు రూ.5వేలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. తమ కోసం పథకం తీసుకొచ్చిన సీఎం జగన్ కు జూనియర్ లాయర్లు ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం తమకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని.. ఆర్థికంగా కొంతవరకు ఇబ్బందులు తప్పుతాయని జూనియర్ లాయర్లు అన్నారు.
సీఎం జగన్ ఇప్పటికే అనేక ఎన్నికల హామీలు నిలబెట్టుకున్నారు. పలు పథకాలను ప్రారంభించారు. జూనియర్ లాయర్లకు స్టైఫండ్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
స్టైఫండ్ కు అర్హతలు:
* దరఖాస్తుదారు లా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.
* దరఖాస్తుదారు పేరు రాష్ట్ర బార్ కౌన్సిల్ సెక్షన్ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్లో నమోదై ఉండాలి.
* కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
* న్యాయవాద చట్టం 1961 సెక్షన్ 22 ప్రకారం రోల్లో నమోదైన తొలి మూడేళ్ల ప్రాక్టీసు సర్టిఫికెట్ను పరిగణనలోకి తీసుకుంటారు.
* జీవో జారీ అయ్యే నాటికి జూనియర్ లాయర్లు ప్రాక్టీసు ప్రారంభించి తొలి మూడేళ్లు పూర్తి కాకపోతే మిగిలిన సంవత్సరాలకు స్టైఫండ్కు అర్హులు.
* 15 ఏళ్ల ప్రాక్టీసు అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాదులు లేదా సంబంధిత బార్ అసోసియేషన్ నుంచి ధృవీకరణ పత్రంతో ప్రాక్టీసులో క్రియాశీలకంగా ఉన్నట్లు ప్రతి 6 నెలలకు జూనియర్ అడ్వకేట్స్ అఫిడవిట్ను సమర్పించాలి.
* న్యాయవాద వృత్తి నుంచి వైదొలిగినా, ఏదైనా మెరుగైన ఉద్యోగం వచ్చినా.. ఆ వివరాలను ఆన్లైన్ ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
* బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న తర్వాత రెండేళ్ల వరకు వారి సర్టిఫికెట్లు బార్ కౌన్సిల్లో ఉంచాలి.
* కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తింప చేస్తారు.
* కుటుంబం అంటే భర్త, భార్య, మైనర్ పిల్లలు.
* ప్రతి దరఖాస్తు దారు ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
* జీవో జారీ చేసేనాటికి జూనియర్ న్యాయవాది 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
* జీవో జారీ అయ్యే నాటికి తొలి మూడేళ్ల ప్రాక్టీసు పూర్తి అయి ఉంటే అనర్హులు
* జూనియర్ న్యాయవాది పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు
* నాన్ ప్రాక్టీసు న్యాయవాదులు అనర్హులు
* అర్హులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* లా డిగ్రీతో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయాలి.
* సీనియర్ న్యాయవాది ధృవీకరణతో బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయినట్లు అఫిడవిట్ అప్లోడ్ చేయాలి.
* దరఖాస్తుతో పాటు ఆధార్ నంబర్ను పొందుపరచాలి.
* దరఖాస్తు దారు నిర్దేశిత బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయాలి.