ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో రోజుకు రూ. 225 లేదా నెలకు రూ. 5 వేల ఆర్థిక సహాయం చేయనున్నట్టు వెల్లడించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లోనే ఇది నేరుగా వారి అకౌంట్లో జమ అవుతుందన్నారు. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తిస్తుందని.. ఇందుకోసం ఏడాదికి రూ. 268.13 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
మంగళవారం(నవంబర్ 26, 2019) స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం ప్రమాణం చేయించారు. స్పందన కింద వస్తున్న వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ నవశకంపై కూడా సమీక్షించారు.
డిసెంబర్ 15 నుంచి 18 వరకు సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని.. డిసెంబర్ 20 నాటికి ఇందుకు సంబంధించిన తుది జాబితాను ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 52 సెంటర్ల ద్వారా సదరం సర్టిఫికేట్స్ను వారానికి రెండు దఫాలు జారీ చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 3న వరల్డ్ డిసేబుల్డ్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 15 నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వారానికి ఒక రోజు సదరం క్యాంపును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 21 మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ. 24వేల ఆర్థిక సాయం అందిచనున్నట్టు తెలిపారు. ఉగాది నాటికి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం మార్చి1 కటాఫ్ తేదీగా లబ్ధిదారుల జాబితాను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు. చరిత్రలో నిలిచిపోయేలా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. జనవరి 1 నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా వేతనాల చెల్లింపు జరుగుతాయన్నారు. డిసెంబర్ 15 నాటికి ఈ జాబితాను సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
జిల్లా స్థాయిలో ఇసుక ధరలు, లభ్యతపై ప్రతివారం పత్రికల ద్వారా సమాచారం ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్న ప్రతి వాహనానికి డిసెంబర్ 10 నాటి జీపీఎస్ తప్పనిసరి చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందకు డిసెంబర్ 10 నాటికి 439 చెక్పోస్ట్లలో నైట్ విజన్ సీసీ కెమరాలను ఏర్పాటు చేయాలని.. దీనిపై ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఒక్క ఫోన్ కాల్తో అవినీతిపరుల భరతం పట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటివరకు 92 శాతం చెక్కుల పంపిణీ జరిగిందని.. వచ్చే సమావేశం నాటి నూరు శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వైఎస్సార్ వాహనమిత్ర కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులందరికీ నేటితో చెల్లింపులు పూర్తి చేశామని సీఎం జగన్ వెల్లడించారు. రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా 45.82 లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. మరో 2.14 లక్షల మంది రైతులకు వారం రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న వర్క్షాపులపై కలెక్టర్లు సీరియస్ దృష్టి సారించాలని సూచించారు. ధాన్యం సేకరణ, రైతులకు చెల్లింపుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్యకార భరోసా కింద ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారికి డిసెంబర్ 15 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.