భువనగిరి : తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రెవెన్యూ చట్టంపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. యావత్ దేశం ఆశ్చర్యపోయేలా 2 నెలల్లో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామన్నారు.
భువనగిరి : తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రెవెన్యూ చట్టంపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. యావత్ దేశం ఆశ్చర్యపోయేలా 2 నెలల్లో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామన్నారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా అనూహ్యమైన మార్పులు తీసుకొస్తామని ప్రకటించారు. రైతులు ఎవరికీ రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అసవరం లేదని, రైతులకు పూర్తి స్థాయి రక్షణ అందిస్తామని చెప్పారు. భువనగిరిలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ రెవెన్యూ చట్టం గురించి మాట్లాడారు.
రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నామని, తొందరపడి రైతులెవ్వరూ సంబంధిత అధికారులకు లంచాలు ఇవ్వొద్దని కేసీఆర్ విఙ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రవేశపెట్టబోయే రెవెన్యూ చట్టం యావత్తు దేశం నేర్చుకునేలా ఉంటుందని అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల్లోని 37 విభాగాలు తొలగించి 3 విభాగాలు మాత్రమే ఉంచామని, ఈ పాసు పుస్తకాల్లో అవకతవకలకు పాల్పడితే సహించమని, రైతుల భూమి రైతులకే ఉండే విధంగా ఈ చట్టం తీసుకొస్తున్నట్టు వివరించారు. 2 నెలల్లో ధరణి వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రతిరోజూ జమాబందీ జరిగేలా చూస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు బీమా పథకంతో రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్నామని చెప్పారు. ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో రూ.5లక్షలు ఉండాలని కేసీఆర్ అన్నారు.