దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి మహా హారతి ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి మహా హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి సహా పలువురు పీఠాధిపతులు హాజరయ్యారు. కాశీలో నిర్వహిస్తున్న గంగా హారతి తరహాలోనే గోదావరి మహా హారతి జరిగింది. తొలి హారతిని త్రిదండి చిన్నజీయర్ స్వామి, కాశీ నుంచి వచ్చిన పండితులు ఇచ్చారు.
గోదావరి మహా హారతిని చూసి తరించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు వచ్చారు. ఇందుకు అనుగుణంగా ధర్మపురిలో భారీ ఏర్పాట్లు చేశారు. గోదావరి నదిలో కార్తీక దీపాలు వదిలే మహిళల కోసం గోదావరి హారతి ఉత్సవ కమిటీ… నది ఒడ్డున ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. గోదావరి పవిత్రతను కాపాడే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం జరిపారు.
కాశీలో గంగానది దిశను మార్చకుని ప్రవహించినట్టే.. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నది ధర్మపురి దగ్గర దిశను మార్చుకుని దక్షిణాభిముఖంగా ప్రవహిస్తుంది. నదులు దిశను మార్చుకుని ప్రహించే ప్రాంతాలను ఎంతో పవిత్ర ప్రదేశాలుగా పరిగణిస్తారు. ఇలాంటి చోట్ల కర్పూర హారతి ఇస్తే ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లుతారని నమ్మకం. జీవ నదుల జలాల పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉంటారని విశ్వాసం. ఈ నమ్మకంతోనే ఏడేళ్లుగా కార్తీక మాసం చివరి ఆదివారం ధర్మపురిలో గోదావరికి మహా హారతి ఇస్తున్నారు. బీజేపీ నేత మరళీధర్రావు ఆధ్వర్యంలో 2012 నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది.
జీవ నదులకు హారతి ఇవ్వడం అనాదిగా వస్తున్న ఆచారం. నీటికి నీరాజనాలు పలకడం మన సనాతన సంప్రదాయం. ఇది హిందువుల జీవన సంస్కృతి. అయితే కాలక్రమంలో ఇవన్నీ మరుగునపడిపోయాయి. మళ్లీ ఈ హారతి సంస్కృతి పనురుద్ధరించి, పరిరక్షంచే లక్ష్యంతో ఏడేళ్ల క్రితం జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదికి మహా హారతి మొదలైంది.