కొంచెం ఇష్టం..కొంచెం కష్టం: జనసేనకు దగ్గరగా లేను,దూరంగానూ లేను: రాపాక

  • Publish Date - February 27, 2020 / 04:26 AM IST

జనసేన పార్టీకి దూరంగానూ లేని అలాగని దగ్గరగానూ లేను అని ఆ పార్టీ ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాకా వర ప్రసాద్ అన్నారు. గురువారం (ఫిబ్రవరి 27,2020)తిరుమల శ్రీవారిని దర్శించుకున్న  అనంతరం రాపాక మాట్లాడుతూ ..ప్రభుత్వ విధానాలు తనకు నచ్చితే మద్దతునిస్తానని..అందుకే ఏపీకి మూడు రాజధానుల విషయంలో తన మద్దతు తెలిపాననీ దానికి తాను ఇంకా కట్టుబడే ఉన్నాననీ రాపాక మరోసారి స్పష్టం చేశారు. 

జనసేన పార్టీకి దూరంగా లేనని.. దగ్గరగా కూడా లేనని స్పష్టం చేశారు. ఈ మధ్య పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలవలేదని తెలిపారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటే తీరప్రాంతాల్లోని గ్రామాలు, వెనకబడిన జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాలు నచ్చితే ఖచ్చితంగా మద్దతిస్తానని ఇంతకు ముందే చెప్పానని ఆయన గుర్తు చేశారు. 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ గెలిచారు. కాగా గత కొంతకాలంగా రాపాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్‌కు పాలాభిషేకాలు చేయడంతో పాటు అసెంబ్లీలోనూ వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించటంతో ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. ఆయన సొంత జిల్లాలో జరిగిన జనసేన కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనలేదు. పార్టీ నిర్వహించిన ఏ కార్యక్రమాలకు హాజరుకాలేదు. దాంతో పవన్ కల్యాణ్ కూడా ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. ఈ క్రమంలో రాపాక వరప్రసాద్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ విధానాలు నచ్చితే జగన్‌కు మద్దతిస్తానని స్పష్టం చేశారు. ఈయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమయ్యాయి.