హైదరాబాద్ షాన్ ఏ షహర్..నగరం శివారులో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రం ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా అలకరించబడింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో 30 ఎకరాల్లో రూపుదిద్దుకున్న కన్హా శాంతివనం మంగళవారం (జనవరి 28,2020) ప్రారంభం కానుంది. ఈ యోగా కేంద్రంలో ప్రముఖ యోగా గురు రాందేవ్బాబా పర్యవేక్షణలో ఫిబ్రవరి 9 వరకు మూడు విడుతలుగా సామూహిక ధ్యాన కార్యక్రమాలను కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో 1.2 లక్షల మంది పాల్గొననున్నారు.
శతాబ్దాల చరిత్ర హైదరాబాద్ సొంతం. విశ్వనగరంగా రూపు దిద్దుకుంటున్న హైదరాబాద్ ప్రసిద్ధికెక్కుతోంది. ఈ నగరం పలు సంస్కృతులకు సమాహారం. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రంగా గ్రేటర్ శివారులోని నందిగామలో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో కన్హాశాంతివనం ఈరోజు ప్రారంభానికి సిద్ధమైంది. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్, హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ దాజీలు కన్హాశాంతివనాన్ని ప్రారంభించనున్నారు.
1400 ఎకరాల్లో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఏర్పాటుకాగా, 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. ఒక సెంట్రల్హాల్, 8 సెకండరీహాల్స్ చొప్పున మొత్తం 9 హాల్స్ను నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే ముంబైలో 2వేల మందికి సరిపోయే ధ్యానకేంద్రముండగా, హైదరాబాద్లో నిర్మితమైన ధ్యానకేంద్రంలో ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసుకోవచ్చు. హార్ట్ఫుల్నెస్ సంస్థ 75వ వార్షికోత్సవంలో భాగంగా తాబేలు ఆకారంలో ఈ మెడిటేషన్ సెంటర్ను నిర్మించారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ మొదటి గైడ్ లాల్జీకి ఈ ధ్యానకేంద్రాన్ని అంకితమివ్వనున్నారు.
ప్రసంగించనున్న రాష్ట్రపతి
ఈ కార్యక్రమంలో ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రాంనాథ్కోవింద్, ఫిబ్రవరి 7న సామాజిక కార్యకర్త అన్నాహజారేలు కూడా ప్రసంగించునున్నారు. ఈ ధ్యానకేంద్రం రాత్రి సమయంలో కాంతుల్లో తళుకుమనుతు సిడ్నీహార్బర్లా కనివిందుచేస్తోంది. 40 వేల మందికి అతిథ్యమిచ్చే క్యాంపస్లో, రోజుకు లక్ష మం దికి భోజనాలు పెట్టే వంటగదులు, 350 పడకల సామర్థ్యం గల ఆయుష్ దవాఖాన, 6 లక్షల మొక్కలతో కూడిన నర్సరీలు ఇదే ప్రాంగణంలో ఉన్నాయి. ఈ ధ్యాన కేంద్రం మంచి లెర్నింగ్ సెంటర్గానే కాకుండా, ప్రశాంతత సమకూర్చే వనంగా సేవలందిస్తుందని నిర్వాహకులు తెలిపారు.