ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు గట్టి షాక్ తగిలింది. నామినేషన్ల గడువుకు సోమవారం చివరితేదీ కావడంతో భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కేఏ పాల్ అక్కడికి వెళ్లారు. అయితే నామినేషన్ సమయం ముగియడంతో ఆయన నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. ఆలస్యంగా వచ్చారంటూ నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. నరసాపురంలో ఎంపీ నామినేషన్ ను ఆలస్యంగా తీసుకున్నారని, అందుకే భీమవరం రావడం ఆలస్యమైందని కేఏ పాల్ తెలిపారు.
చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లు కుట్ర పన్నారని పాల్ మండిపడ్డారు. గెలుస్తానన్న భయంతో భీమవరం ఆలస్యంగా చేరుకునేలా చేశారని కేఏ పాల్ విమర్శించారు. నరసాపురంలో ఎంపీగా గెలిచి తానేంటో చూపిస్తానని కేఏ పాల్ అన్నారు. భీమవరం నుంచి జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.