సంపూర్ణ మద్య నిషేధం దిశ జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితాలు ఇస్తున్నాయి. జగన్ సీఎం అయ్యాక కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మద్యం ధరలు
సంపూర్ణ మద్య నిషేధం దిశ జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితాలు ఇస్తున్నాయి. జగన్ సీఎం అయ్యాక కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మద్యం ధరలు పెంచారు, అమ్మకాల సమయాన్ని తగ్గించారు. ఈ నిర్ణయాలు రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఏపీలో మద్యం విక్రయాలు భారీగా తగ్గాయి. 2018తో పోలిస్తే 2019 అక్టోబర్ లో గణనీయంగా మద్యం విక్రయాలు, వినియోగం తగ్గు ముఖం పట్టాయి. రాష్ట్ర బేవరేజెస్ కార్నొరేషన్ లిమిటెడ్ అధికారులు విడుదల చేసిన వివరాలే ఇందుకు నిదర్శనం.
బెవరేజెస్ కార్పొరేషన్ తాజా లెక్కల ప్రకారం… 2018 అక్టోబర్ లో 32లక్షల 28వేల 366 కేసులు లిక్కర్ను విక్రయించగా 2019 అక్టోబర్ లో మాత్రం 23లక్షల 60వేల 089 కేసులు మాత్రమే అమ్ముడైనట్లు తెలిపారు. అంటే.. గతేడాది అక్టోబర్ తో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబర్ లో మద్యం విక్రయాలు 27 శాతం తగ్గాయి. బీర్ల అమ్మకాలు చూసుకుంటే 2018 అక్టోబర్ లో 23లక్షల 86వేల 397 కేసులు అమ్ముడు కాగా ఈ ఏడాది అక్టోబర్ లో 10లక్షల 40వేల 539 కేసులు మాత్రమే విక్రయించినట్లు తెలిపారు. అంటే గతేడాది అక్టోబర్ తో పోలిస్తే 56.4 శాతం తక్కువగా బీర్లు అమ్మకాలు జరిగాయి.
జగన్ సర్కార్ వచ్చాక రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను 4వేల 380 నుంచి 3వేల 500కు తగ్గించారు. అలాగే కొన్ని షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్మకాలను పరిమితం చేశారు. మరోవైపు పర్మిట్ రూమ్ లు రద్దు చేశారు, గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చూశారు. ఇటీవలే నియమితులైన గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామాల్లో నిరంతరం నిఘా పెంచుతున్నారు. గ్రామ సచివాలయాల ఏర్పాటులో భాగంగా మహిళా పోలీసులను నియమించారు. మద్య నియంత్రణ, నిషేధం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు మహిళల నుంచి మద్దతు లభిస్తోంది. ఓవరాల్ గా ఈ చర్యలన్నీ మద్యం అమ్మకాలు తగ్గడానికి కారణం అయ్యాయి.