కరీంనగర్ తిమ్మాపూర్లో కొత్త కట్టుకుంటున్న ఓ ఇంట్లో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. మహాత్మాగాంధీ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసినట్లుగా ఉండటంతో సదరు ఇంటి యజమానులు భయాందోళనలకు గురయ్యారు. శుభమాని ఇల్లు కట్టుకుంటే ఎవరో తమ ఇంట్లో క్షుద్రపూజలు చేశారని వారు వాపోతున్నారు. దీనిపై సదరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఎల్ ఎండీ పోలీసులు విచారణ చేపట్టారు.
దీనిపై ఇంటి యజమానులు మాట్లాడుతూ..మహాత్మాగాంధీ నగర్లో గత నాలుగు నెలల క్రితం స్థలం కొన్నామని..కొన్న స్థలంలో స్వంతగా ఓ ఇంటిని కట్టుకుంటున్నామనీ..ప్రతీ రోజు ఇంటికి వచ్చి పనులను పరిశీలిస్తుంటాం. అలా శుక్రవారం (ఫిబ్రవరి 21,2020)న ఉదయం కూడా నిర్మాణంలో ఉన్న నీటిని తడపటానికి రాగా ఇంటి మధ్యలో ముగ్గు వేసి ఉందని ఆ ముగ్గులో పసుపు,కుంకుమలతో పూజ చేసినట్లుగా ఉందని..ఓ కోడిని కూడా బలి ఇచ్చినట్లుగా ఉందని అది చూసి తాము భాయాందోళనలకుగురయ్యామని తెలిపారు.
ఇంటి నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది. మరో వారం రోజుల్లో గృహప్రవేశం కూడా చేయాలనుకుంటున్న సమయంలో కొత్త ఇంటిలో క్షుద్రపూజలు చేయటంతో తాము ఎంతో భయపడుతున్నామని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. రాత్రి 11 గంటల వరకూ ఇంటి నిర్మాణ పనులు చూసుకుని వెళ్లామని..ఉదయం వచ్చి చూడగా క్షుద్రపూజలు చేసినట్లుగా ఉండటంతో భయపడి..పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని తెలిపారు.