స్వర్ణకవాచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తున్న పరాశక్తి
- veegam team
- Published On : September 29, 2019 / 04:15 AM IST
విజయవాడ శరన్నవరాత్రి శోభతో వెలిగిపోతోంది. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం (సెప్టెంబర్ 29) నుంచి స్నపనాభిషేకంతో ప్రారంభమయ్యాయి.10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారి పది అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
దీంట్లో భాగంగా తొలిరోజైన ఆదివారం దుర్గమ్మ స్వర్ణకవాచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు 10 రూపాల్లో దర్శనమివ్వనున్న అమ్మవారి దర్శనం ప్రతిరోజు ఉదయం 3గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కొనసాగనుంది.
తొలిరోజు దసరా ఉత్సవాల్లో భాగంగా..దుర్గ గుడి ఈవో సురేష్ బాబు దంపతులు, సీపీ ద్వారకాతిరుమల రావు దంపతులు అమ్మవారి తొలిపూజను నిర్వహించి ప్రారంభించారు. ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలకు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
