టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి బాలకృష్ణ స్నేహితుడు
- veegam team
- Published On : March 10, 2020 / 09:21 AM IST
2019 ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా నుంచి టీడీపీకి మరో షాక్ తగలనుంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాణ స్నేహితుడు కదిరి బాబూరావు వైఎస్సార్సీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం.
బాబూరావు టీడీపీకి గుడ్ బై చెప్పి త్వరలోనే వైఎస్సార్సీపీ కండువా కప్పుకుంటారని ఊహాగానాలు మొదలయ్యాయి. తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన కదిరి.. పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారని.. త్వరలోనే పార్టీ మారతారని చెబుతున్నారు. మంగళ, బుధవారాల్లో జగన్తో భేటీకాబోతున్నట్లు వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే జిల్లా వైసీపీ నేతలతో బాబూరావు చర్చలు జరిపినట్లు..త్వరలోనే జగన్ ను కలిసి పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. (టీడీపీకి పులివెందుల సతీష్ రెడ్డి రాజీనామా!)
కదిరి బాబూరావు 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో ఓడిపోయారు. బాబూరావు వాస్తవానికి కనిగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. కానీ మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఎంట్రీతో.. ఆయన్ను దర్శికి పంపించి.. అక్కడి నుంచి పోటీ చేయించారు.
