మా గ్రామ దేవతకు నైవేద్యం పెట్టాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా? మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? లేక పాకిస్థాన్ లో ఉన్నామా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలోని మహిళలు. మందడం గ్రామ దేవత ‘పోలేరమ్మ’కు గ్రామ మహిళలు నైవేద్యాలు సమర్పిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.గుడి వద్ద ఎవ్వరూ ఉండకూడదనీ..అసలు గుడి దగ్గరకు ఎవ్వరూ రావటానికి వీల్లేదంటూ అడ్డుకుంటున్నారు.అమ్మవారికి నైవేద్యం పెడుతున్న కొంతమంది మహిళల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనదనీ..అమ్మవారికి శుక్రవారం నైవేద్యాలు సమర్పించటం ఆనవాయితీ అని అందుకే అమ్మవారికి నైవేద్యాలు తీసుకొచ్చామనీ దీంట్లో తప్పేముందని మమ్మల్ని అడ్డుకుంటున్నారు? ఇదేమీ ప్రభుత్వం? మా గ్రామ దేవతకు నైవేద్యం పెట్టటానికి కూడా ప్రభుత్వం అనుమతి..పోలీసులు అనుమతి తీసుకోవాలా? అంటూ మండిపడ్డుతున్నారు మహిళలు.
గ్రామంలోని మహిళలు గ్రామ దేవత దేవాలయానికి వెళుతుంటే పోలీసులు ఏదో మమ్మల్ని తీవ్రవాదుల్ని చూసినట్లుగా చూస్తున్నారనీ..మా వెంటే పోలీసులు కాపాలా కాస్తున్నారనీ మేమేమన్నా తీవ్రవాదులా? ఈ దారుణం ఏంటి? మా గ్రామంలో కూడా మాకు స్వేచ్ఛ లేదా ? అంటూ మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అమ్మవారికి పొంగళ్లు పెడుతుంటే పోలీసులు అడ్డుకోవటమేంటి? ఇది ఎక్కడా చూడలేదు. ఏ ప్రభుత్వం కూడా ఇలా వ్యవహరించలేదు.
అమ్మవారికి నైవేద్యాలనుకూడా పోలీసులు అడ్డుకుంటున్నారు? వీరికి ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు? అంటూ శాపనార్థాలు పెడుతున్నారు మందడం గ్రామ మహిళలు. అమ్మవారి ముందు ఈ రాజకీయాలేంటి? ఈ కుట్రలేంటీ? వీరికి చేటు కాలం దాపురించింది అంటూ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.