మహిళలపై పోలీసులు దాడి చేయలేదు..అనుకోకుండా గాయపడ్డారు : ASP చక్రవర్తి

  • Publish Date - January 3, 2020 / 09:29 AM IST

అమరావతి ప్రాంత గ్రామాల్లో సకల జనుల సమ్మెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మందడంలో ధర్నా చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో కొంతమంది మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై ఏఎస్సీ చక్రవర్తి మాట్లాడుతూ..మహిళలపై తాము దాడి చేయలేదనీ..రోడ్డుపై బైఠాయించినవారిని తప్పించేందుకు యత్నించే క్రమంలో మహిళలకు అనుకోకుండా గాయాలయ్యాయనీ తెలిపారు. రైతులు, మహిళలు స్వచ్ఛందంగా సకల జనుల సమ్మె చేసుకుంటే తాము ఏమీ అడ్డుకోమనీ..హద్దు మీరి ప్రవర్తిస్తే ఊరుకోం అని హెచ్చరించారు.  

నేటికి 17 రోజులుగా రాజధాని అంశంపై అమరాతి ప్రాంతంలోని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగా మహిళలు ప్రతీ రోజు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో 17వ రోజు రైతులు..మహిళలు సకల జనుల సమ్మె చేపట్టారు. దీంతో పోలీసులు ధర్నా చేపట్టిన మహిళల్ని అడ్డుకున్నారు. మందడంలో మహిళలకు..పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగటంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ క్రమంలో పోలీసులు ఓ వృద్ధ మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ వ్యాన్ ఎక్కించే క్రమంలో పోలీసుల్ని అక్కడ ఉన్న మహిళలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఒక మహిళ స్మృహ తప్పి పడిపోయింది. మరికొంతమంది మహిళలకు గాయాలు కూడా అయ్యాయి. దీంతో పోలీసులపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై మగ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. పోలీస్ జులం నశించాలి..సీఎం జగన్ డౌనై డౌన్..మూడు రాజధానులు వద్దు..అమరావతి ఒక్కటే రాజధానిగా ముద్దు అంటూ నినాదాలు చేశారు.