Cultivation of Fruits : వ్యవసాయ రంగంలో రాణించాలంటే అధునాతన పద్ధతులు, వినూత్న ఆలోచనలే కీలకం. సంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే గిట్టుబాటు అయ్యే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. అందుకే వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతులు.. క్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఈ క్రమంలో రూపుదిద్దుకున్నదే ఐదంతస్తుల పంటల సాగు విధానం. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ విధానాన్ని ఏలూరు జిల్లా రైతు ఆచరిస్తూ.. మంచి దిగుబడులను పొందుతున్నారు.
Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు
మంచి దిగుబడి పొందాలంటే… నాణ్యమైన విత్తనం ఒక్కటే సరిపోదు. ఆ పండించే విధానంతో పాటు భూమిలో శక్తి ఉండాలి. వానపాములు, సూక్ష్మజీవులు ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా సేంద్రియ కర్బనం అధికంగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న నేల బంగారంతో సమానం. ఆ భూమిలో ఏ పంటైనా పండుతుంది. ఏ చీడపీడలనైనా తట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం వ్యవసాయ భూముల్లో ఇదే లోపించింది. అందుకే రసాయన సాగు నుంచి సేంద్రియ సేద్యానికి వస్తున్న రైతులు మొదట కనీస దిగుబడులు రాక కొంత మంది రైతులు తిరిగి రసాయన మందుల వాడకానికే మొగ్గుచూపుతున్నారు.
కానీ నేల ఆరోగ్యంగా మారి పంటల సాగు విధానం మార్చితే సౌభాగ్యమైన పంట పండుతుందనేందని కొంత మంది నిరూపిస్తున్నారు ఈ కోవకు చెందిన వారే.. ఏలూరు జిల్లా, నూజివీడు మండలం, రావిచర్ల గ్రామానికి చెందిన రైతు మన్యం రాధాకృష్ణ. తనకున్న 3 ఎకరాల్లో ప్రకృతి విధానంలో.. ఐదంచెల సాగు పద్ధతులను ఆచరిస్తున్నారు.
ఐదంచెల వ్యవసాయ విధాన ముఖ్య ఉద్దేశ్యం ప్రతి అంగుళం భూమిని ఫలవంతంగా ఉపయోగించుకోవడం.. తద్వారా అధిక ఆధ్యాన్ని గడించడం. రైతు తన పొలం మొత్తం విస్తీర్ణంలో ఒక ప్రధాన పంటను సాగు చేయడంతో పాటు అంతర పంటలుగా ఉద్యానవన పంటలను సాగు చేయడం. ఈ విధానంలోనే రైతు రాధాకృష్ణ మూడేళ్ల క్రితం మామిడి, కొబ్బరి మొక్కలను నాటారు. రెండేళ్ల క్రితం అరటిని నాటారు. గత ఏడాది వక్కను నాటారు. 5 వ సంవత్సరం నుండి వక్క దిగుబడి పొందవచ్చు. అప్పటి వరకు అంతర పంటలనుండి ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు.
రసాయనిక వ్యవసాయం వలన జరిగిన, జరుగుతున్న అనర్థాల నుండి బయట పడటానికి సేంద్రియ సాగు పద్ధతులను నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులకు వివరిస్తున్నారు. సేంద్రియ సాగుచేసే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నారు. దీనిని ఆచరిస్తున్న రైతులు ఫలితాలను పొందుతున్నారు. ప్రతి రైతు ఐదంచెల విధానం ద్వారా నిత్యం ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు రాధాకృష్ణ . రైతులు, ప్రజలతో పాటు నేలతల్లి ఆరోగ్యంగా వుండాలంటే ప్రకృతి సేద్యమే ఏకైక మార్గమంటున్నారు.
Read Also : Tulasi Cultivation : తులసి సాగుతో అధిక ఆదాయం పొందుతున్న గిరిజనులు