Fenugreek Crop : మెంతుల పంట సాగులో మెళుకువలు!

హెక్టారుకు సుమారు 15 టన్నుల సేంద్రీయ ఎరువుతో పాటు , 25 కిలోల నత్రజని , 25 కిలోల భాస్వరం , 50 కిలోల పొటాష్ ఎరువులు అవసరం. సగం నత్రజని ఎరువు, మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను విత్తుకునే సమయంలోనే వేసుకోవాలి.

Cultivation techniques of Fenugreek crop!

Fenugreek Crop : మెంతులు, మెంతి కూరలో అధిక ఔషధ గుణాలు ఉండటం వల్ల దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ పంటను మన దేశం నుండి సౌదీ అరేబియా, జపాన్, శ్రీలంక, కొరియా , ఇంగ్లాండ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇది ఏక వార్షిక మొక్క. ఈ మొక్క సుమారుగా ఒక మీటరు ఎత్తు పెరుగుతుంది. పంట ఆకు కూరగా సాగు చేస్తే 25 రోజులు గింజల కోసమైతే 100 రోజుల సాగు వ్యవధి ఉంటుంది. ఎలాంటి వాతావరణంలో నైనా పెరుగుతుంది. చలి , గడ్డకట్టే వాతావరణాన్ని తట్టుకోగలదు. దీన్ని అత్యల్ప మోస్తరు వర్షపాతం కలిగిన ప్రదేశాల్లో సాగు చేసుకోవచ్చు. అధిక వర్షపాతం గల ప్రదేశాలు మాత్రం ప్రతికూలమైనవి. బంకమట్టి , క్షారగుణం కలిగిన నేలలు అనుకూలం.

సాగుకు అనువైన రకాలు ; కో 1, రాజేంద్ర కాంతి, ఆర్ ఎంటి 1, లాం సెలక్షన్ 1 , కసూరి, ఆర్ ఎం టి 143, మేధి నెం 47, మేధి నెం 14, ఇసి 4911, హెచ్ 103, హిస్సార్ సొనాలి మొదలైనవి ముఖ్యమైన రకాలు. వీటిలో మేథి నెం 47 , మేధి నెం 14 రకాలు అధిక దిగుబడినిచ్చే రకాలు.

భూ యాజమాన్యం, విత్తే పద్ధతులు ; భూమిని కనీసం మూడుసార్లు బాగా దుక్కిదున్ని ఏకరీతిగా మడులను తయారు చేసుకొని , వాటిపై విత్తనాన్ని వెదచల్లుకోవాలి. వరుసల మధ్య 20 సెంమీ దూరం ఉండేటల్లు నాటుకుంటే అంతర కృషి సులభంగా చేసుకునే వీలుకలుగుతుంది. సాధారణంగా మైదానాల్లో సెప్టెంబర్ నుండి నవంబర్ నెలల్లో విత్తుకుంటారు. అదే పర్వతప్రాంతాల్లో మార్చి నెలలో విత్తుతారు.

దక్షిణ భారత దేశంలో ఈ పంటను ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాల్లోనూ సాగు చేసుకోవచ్చు. కానీ ఖరీఫ్ తో పోలిస్తే రబీ పంట అధిక దిగుబడినిస్తుంది. సాధారణంగా హెక్టారుకు 25 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తిన 8 రోజుల్లో విత్తనం మొలకెత్తటం ప్రారంభమౌతుంది. విత్తుకునే ముందు విత్తనాన్ని రైజోబియం కల్చర్ తో శుద్ధి చేసుకోవటం వల్ల అధిక దిగుబడి పొందవచ్చు.

ఎరువు యాజమాన్యం ; హెక్టారుకు సుమారు 15 టన్నుల సేంద్రీయ ఎరువుతో పాటు , 25 కిలోల నత్రజని , 25 కిలోల భాస్వరం , 50 కిలోల పొటాష్ ఎరువులు అవసరం. సగం నత్రజని ఎరువు, మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను విత్తుకునే సమయంలోనే వేసుకోవాలి. మిగిలిన సగం నత్రజని ఎరువును , పంట 30 రోజుల వయసు ఉన్నప్పుడు వేసుకోవాలి.

నత్రజని ఎరువును ఆకులు కత్తిరించిన ప్రతిసారి వేసుకున్నట్లైతే ఆకుల దిగుబడి బాగా రావటానికి ఉపయోగపడుతుంది. మొదటిసారి విత్తిన వెంటనే నీటిని అందించాలి. తరువాత నుండి ప్రతి 10 రోజులకు ఒకసారి నీటిని ఇవ్వాల్సి ఉంటుంది. పూత, కాయ సమయాల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

కలుపు యాజమాన్యం ; పంట నాటిన నుండి నాలుగు వారాలకు మొదటి సారి కలుపు మొక్కలు తీసివేయాలి. తరువాత 40 రోజులకు మరొసారి కలుపు నివారణ చేపట్టాలి. దీనితోపాటుగా ఫ్లూక్లోరాలిన్ అనే కలుపు మందును హెక్టారుకు 0.75 కిలోలను ఉపయోగించి కలుపు మొక్కలను నివారించవచ్చు.