Kaveri Vari Sanna Rakalu
Paddy Cultivation : ఏ ఏటికాఏడు ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తోంది. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులకు తోడు మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇటు భూమి సారాన్ని కోల్పోతుండటంతో రైతులు ప్రకృతి విధానంలో పంటల సాగు చేపడుతున్నారు.
ఇప్పటికే చాలా మంది రైతులు ఈ విధానం వైపు మళ్ళారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా కు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో రెండు ఎకరాల్లో దేశీ వరి రకం సాగు చేస్తూ.. నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. అంతే కాదు వరిని పట్టించి బియ్యంను అధిక ధరకు విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు.
ఇదిగో ఇక్కడ చూడండీ.. నిండుగా బరువైన వరి గింజలతో ఉన్న ఈ వరి పంటను. ఎలాంటి రసాయన మందులను వాడకుండా… కేవలం ప్రకృతి విధానంలో సాగుచేశారు ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం, వడ్లమాను గ్రామ రైతు వెంకటేశ్వరరావు.
అతి తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన దిగుబడులు :
2016 నుండి ప్రకృతి విధానంలో సాగుచేస్తున్న రైతు.. గత ఏడాది నుండి దేశీ వరి విత్తనాలను సాగుచేస్తున్నారు. ఈ ఏడాది కావేరీ సన్నాలను సాగుచేశారు. అతి తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. కోతకు సిద్ధంగా ఈ పంట మంచి దిగుబడి రానుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Paddy Cultivation : గిర్ ఆవులతో వరి సాగు.. 5 ఏళ్ళుగా ఆవు మజ్జిగతో వ్యవసాయం
ఆంధ్రా అంటేనే అన్నపూర్ణగా ప్రసిద్ధి. రాష్ట్రంలో ప్రధాన ఆహార పంట వరి. రాష్ట్రంలో అత్యధికంగా పండించే పంట ఇదే. లక్షలాది ఎకరాల్లో సాగు చేస్తారు. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదుల ఆయకట్టులో వరి సాగే కీలకం.
అయితే ఏటా వచ్చే ప్రకృతి విపత్తులతో రైతులు వరిపంటను నష్టపోవాల్సి వస్తోంది. ఇటీవల కురిసిన మిగ్ జామ్ తుఫాను కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. కానీ రైతు వెంకటేశ్వరరావు ప్రకృతి విధానంలో సాగుచేయడంవల్ల పైరు దృడంగా పెరిగి నేలపై పడిపోలేదని ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు అంటున్నారు.