korameenu fish farming techniques in telugu
Korameenu Fish Farming : కాలానికి అనుగుణంగా పంటలసాగులో కూడా మార్పులు వస్తున్నాయి. ఒకే పంటపై ఆధారపడకుండా అనుబంధ రంగాను కూడా పెంచుతూ.. ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు రైతులు. ఈ కోవలోనే హైదరాబాద్ కు చెందిన ఓ యువరైతు సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. ప్రధాన పంటగా నాటు కొర్రమేను పిల్లల ఉత్పత్తి చేస్తూ.. అనుబంధంగా కోళ్లు, బాతులతో పాటు జామ, అరటి తోటలను పెంచుతున్నారు. ఈ విధానంలో ఒక దానినుండి వచ్చే వ్యర్థాలు మరో దానికి వాడుతూ.. తక్కువ పెట్టుబడితో అదనపు ఆదాయం పొందుతున్నారు.
Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే, అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు. సంప్రదాయ పంటలపైనే ఆదారపడకుండా ఏకకాలంలో వివిధ రకాల పంటలతోపాటు అనుబంధ రంగాలను పెంచితే అదనపు ఆదాయన్ని పొందవచ్చు. ఈ దిశగ అడుగులు వేసి సక్సెస్ అయ్యారు హైదరాబాద్ కు చెందిన యువరైతు శణ్ముఖ సాయినాథ్.
ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన ఈయన రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ మండలం, అన్నారం గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయం భూమిని లీజుకు తీసుకొని అందులో కొరమేను చేపల పెంపకం, పిల్లల ఉత్పత్తి చేస్తున్నారు. అనుంబంధంగా కోళ్లు, బాతులు, ఈముకోళ్లను, జామతోటలను పెంచుతున్నారు.
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్యాంక్ లను చూడండీ. ఇవన్నీ రేరింగ్ యూనిట్ లు. ఇందులో వివిధ సైజుల్లో కొర్రమేను పిల్లలు ఉన్నాయి. రైతు సాయినాథ్ సహజ సిద్ధంగా కొర్రమేనే పిల్లల ఉత్పత్తికోసం చిన్న చిన్న చెరువులను తీశారు. ఒక్కో చెరువులో మేలుజాతి నాటుకొరమేను జతలను వదిలారు.
అందులో ఉత్పత్తి అయిన పిల్లలను రేరింగ్ ట్యాంక్ లో వదిలి పెంచుతున్నారు. గ్రేడింగ్ పద్ధతులను అవలంబిస్తూ.. అన్ని సమానంగా పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాదు.. వీటికి సరైన సమయంలో సరైన మోతాదులో ఫీడ్ అందిస్తూ.. నాణ్యమైన పిల్లల ఉత్పత్తిని చేస్తున్నారు. కావాల్సిన రైతులకు అందిస్తూ.. పంట చేతికొచ్చే వరకు వారికి తోడుగా ఉంటూ.. సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
కొర్రమేనుతోపాటు మరికొన్ని చేపల రకాలను అభివృద్ధి చేస్తున్నారు రైతు. వీటితో పాటు అలంకార చేపలు, ముత్యపు చిప్పల పెంపకం చేస్తున్నారు. అంతే కాదు ఈ చేపల నర్సరీ ట్యాంకుల నుండి వచ్చే నీటిని వృధా కాకుండా ఉండేందుకు అరటి, జామ తోటలను నాటి వాటికి అందిస్తున్నారు. అలాగే బాతులు, ఈము పక్షులు, నాటుకోళ్లను పెంచుతున్నారు. ట్యాంకులో ఏర్పడే నాచును పడేయకుండా బాతులకు ఆహారంగా అందిస్తూ.. ఖర్చులను తగ్గించుకుంటున్నారు.
ఒకవైపు కొరమేను విత్తన చేప పిల్లలను ఉత్పత్తి చేస్తూనే… పెంపకం చేపడుతూ.. మరోవైపు సమీకృత వ్యవసాయాన్ని చేస్తున్నారు. జామతోట, నాటుకోళ్లు, బాతులలో పాటు రెండు గుర్రాలను పెంచుతూ.. సరికొత్త సాగుకి శ్రీకారం చుట్టిన రైతు సాయినాథ్.. పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు