Prawn Farming : అమాంతం పడిపోయిన రొయ్య ధరలు.. ఆందోళనలో పశ్చిమగోదావరి జిల్లా రొయ్య రైతులు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 70 వేల ఎకరాల్లో రొయ్యల సాగు విస్తరించి ఉంది. వరుసగా రెండుసార్లు తెల్లమచ్చల వైరస్ దాడితో విలవిల్లాడిన రైతులు ఈసారి దిగుబడులపై కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయారు.
- Guntupalli Ramakrishna
- Published On : August 17, 2023 / 10:38 AM IST
Prawn Farming
Prawn Farming : రొయ్యల రైతుల కష్టాలు తీరడం లేదు. ఇప్పటిదాకా వైరస్ ఉద్ధృతితో నష్టాలు చవిచూసిన వారికి ప్రస్తుతం నేలచూపులు చూస్తున్న ధరలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సిండికేట్ మాయాజాలంలో చిక్కి అల్లాడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో స్వల్ప మార్పును అవకాశంగా చేసుకుని కొందరు ట్రేడర్లు ఒక్కసారిగా ధరలు తగ్గించేశారు. ఒక టన్ను 100 కౌంట్ రొయ్యలు విక్రయిస్తే రైతు రూ.50 వేలు నష్టపోవాల్సి వస్తోందిని వాపోతున్నారు.
READ ALSO : Sravana Masam 2023 : ఈరోజు నుంచే నిజ శ్రావణ మాసం ప్రారంభం .. ఆధ్యాత్మిక శోభ కళకళలాడనున్న గృహాలు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 70 వేల ఎకరాల్లో రొయ్యల సాగు విస్తరించి ఉంది. వరుసగా రెండుసార్లు తెల్లమచ్చల వైరస్ దాడితో విలవిల్లాడిన రైతులు ఈసారి దిగుబడులపై కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయారు. ప్రస్తుతం వంద కౌంట్ ధర రూ.190 పలుకుతోంది. ఇది రూ.230 ఉంటేగానీ తమకు గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతోందని, ధరలను స్థిరీకరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
READ ALSO : Production of Natu Koramenu : నాటు కొరమేను పిల్లల ఉత్పత్తి.. అనుబంధంగా కోళ్లు, బాతుల పెంపకం
జిల్లా నుంచి రొయ్యలు ఇతర దేశాలకు పెద్దఎత్తున ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు పెద్దగా తగ్గకున్నా.. ఇక్కడ మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. కొనుగోలుదారులు సిండికేటుగా మారి ధరలను శాసిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒకపక్క రొయ్య పిల్లలు, మేత, మందుల ధరలు, చెరువుల లీజులు పెరుగుతుంటే రొయ్యల ధరలు నేలను తాకుతుండటం ఆందోళన కలిగించే అంశం. రొయ్యల ధర అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఉంటుంది. తగ్గుదలతో రైతులు పడుతున్న ఇబ్బందుల పట్ల ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
