Turmeric Cultivation : ఖరీఫ్ కు అనువైన పసుపు రకాలు.. అధిక దిగుబడులు పొందేందుకు మెళకువలు
సాధారణంగా రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ళ వరకు విత్తనాన్ని వాడుతుంటారు. బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో పెద్ద కొమ్ములను నాటటానికి ఉపయోగిస్తుండటం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కణువుల వద్ద ముక్కలుగా కోసి ముచ్చెలను బోదెలపై విత్తుకోవాలి.
- Guntupalli Ramakrishna
- Published On : June 20, 2023 / 07:00 AM IST
Turmeric Cultivation
Turmeric Cultivation : పసుపు పంట విస్తీర్ణంలో , ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు. దాదాపు 1 లక్షా 72 వేల ఎకరాల్లో సాగుచేయబడుతూ నాలుగున్నర లక్షల టన్నుల ఉత్పత్తినిస్తోంది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 30 వేల ఎకరాలకు పైగా సాగులో ఉండటం విశేషం. గత మూడు సంవత్సరాలుగా పసుపుకు గిట్టుబాటు ధరలేక పోవటంతో సాగులో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కు అనుగుణంగా పసుపు నాటేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రకాల ఎంపిక, సాగులో పెట్టుబడుల భారాన్ని తగ్గించుకుని, అధిక దిగుబడులు ఏవిధంగా తీయవచ్చో… తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా, కమ్మర్ పల్లి పసుపు పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. మహేందర్.
పసుపు దుంపజాతి ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా వుంటుంది. 25-35డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వున్న ప్రాంతాల్లో నాటిన దుంప, మొలకెత్తేటానికి అనువుగా వుంటుంది. బలమైన నేలలు పసుపు పండించటానికి శ్రేష్ఠమైనవి. పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషద,సుగంధ పరిశ్రమల్లోను, కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు.
READ ALSO : Turmeric Crop Cultivation : మేలైన పసుపు రకాలు.. సాగు యాజమాన్యం
మరి ఇంత ప్రాధాన్యత వున్న పసుపుసాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు, శాస్త్రీయంగా సాగుచేయాల్సి ఉంటుంది. సాధారణంగా స్వల్పకాలిక పసుపు రకాలను ముందుగా అంటే మే రెండవ పక్షంలో నాటతారు. మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి వుంటుంది. దీర్ఘకాలిక రకాలను జూన్ 15 నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి. పసపు విత్తటానికి నిర్ధేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాధముంది.
READ ALSO : Turmeric Production : పసుపు తీతలో జాగ్రత్తలు.. నాణ్యమైన పసుపు ఉత్పత్తికి మెళకువలు
ప్రస్థుతం స్వల్ప, మధ్యకాలిక రకాలు విత్తుకోవటానికి అనువైన సమయం. ప్రస్తుతం సాగు నీరు ఉండి ఉష్ణోగ్రతలు 18-35 ఉంటే ఈ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. లేదంటే జూన్ మొదటి వారంలో వర్షాలు పడ్డాకా విత్తుకోవాలని సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లా, కమ్మర్ పల్లి పసుపు పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. మహేందర్.
సాధారణంగా రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ళ వరకు విత్తనాన్ని వాడుతుంటారు. బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో పెద్ద కొమ్ములను నాటటానికి ఉపయోగిస్తుండటం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కణువుల వద్ద ముక్కలుగా కోసి ముచ్చెలను బోదెలపై విత్తుకోవాలి. తద్వారా ఎకరాకి 5 క్వింటాల వరకు విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. అంతే కాదు దుక్కిలోనే శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా ఎరువులను వేయాలి.
