అర్ధరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు…. నలుగురు మృతి

  • Publish Date - October 16, 2020 / 09:06 AM IST

Guntur district : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా అద్దంకి వెళుతున్నకారు….రొంపిచర్ల మండలం తంగెడమల్లి మేజర్‌ కాలువలోకి గురువారం అర్ధరాత్రి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు.



జగిత్యాల జిల్లా ధర్మపురిలో నివాసముంటున్న మాధవ్‌ అనే వ్యక్తి ఇళ్లకు రంగులు వేస్తుంటాడు. ప్రకాశం జిల్లా పామూరిలోని సొంతింటికి రంగులు వేయించేందుకు తన దగ్గర పనిచేస్తున్న బీరూగౌడ్‌, బాలాజీతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు వ్యక్తుల్ని తీసుకుని గురువారం రాత్రి జగిత్యాల నుంచి కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెం వద్ద కారు అదుపుతప్పి తంగేడుమల్లి మేజర్‌ కాలువలోకి దూసుకెళ్లింది.



ఈ ప్రమాదంలో బీరూ గౌడ్‌, బాలాజీతో పాటు మరో ఇద్దరు మృతిచెందగా.. మాధవ్‌, డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు.‌ గాయపడిన బయటపడిన మాధవ్..‌ అటుగా వెళ్తున్న పోలీసులకు ప్రమాదం గురించి వివరించాడు. దీంతో పోలీసులు కారుతోపాటు మృతదేహాలను వెలికితీసి నర్సారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నార్కట్‌పల్లి-మేదరమెట్ల రహదారిలో రొంపిచర్ల-సుబ్బయ్యపాలెం మధ్య అర్ధరాత్రి  సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

ట్రెండింగ్ వార్తలు