వైఎస్‌ఆర్‌ రైతుభరోసా – పిఎం కిసాన్‌ : రైతుల ఖాతాల్లో నగదు జమ

  • Publish Date - May 15, 2020 / 07:53 AM IST

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌’ పథకాన్ని ప్రారంభించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ఈ పథకాన్ని‌ ప్రారంభించారు. ప్రతి రైతు కుటుంబానికి తొలి విడతగా రూ.7,500 రైతుల ఖాతాలో జమ కానున్నాయి. రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించినట్టు జగన్ తెలిపారు. సాధారణ పరిస్థితులు ఉంటే రైతులతో కలిసి భారీ సభలో ఈ కార్యక్రమం నిర్వహించేవాళ్లమన్నారు. 

రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఎంత చేసినా తక్కువేనని అన్నారు. వ్యవసాయానికి పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతోనే పెట్టుబడి సాయంగా రైతు భరోసా కింద రూ.13500 ఏటా అందిస్తున్నాని జగన్ స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ. 12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పినప్పటికీ రూ.13,500 చొప్పున ఐదేళ్లపాటు ఇస్తామని జగన్ ప్రకటించారు.

‘గతేడాది రూ.6350 కోట్లు రైతు భరోసా కింద చెల్లించామన్నారు. రైతు భరోసా కింద రూ.5500 నగదు రైతుల అకౌంట్‌లో జమ చేస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌లో 2వేలు ఇచ్చామన్నారు. ఇప్పుడు రూ.5500 ఇస్తున్నట్టు తెలిపారు. కౌలు రైతులు, అటవీ భూములు, అసైన్డ్ భూములు సాగు చేస్తున్నవారికి రూ.7500 అందజేస్తామని హామీ ఇచ్చారు. అక్టోబర్‌లో 4వేలు, వచ్చే సంక్రాంతికి మరో 2వేలు అందజేస్తామన్నారు. రైతు భరోసా కింద మొత్తం రూ.13,500 రైతులకు అందిస్తామని జగన్ తెలిపారు. గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నామన్నారు. ఎవరైనా పేరు లేకపోతే నమోదు చేయించుకునే అవకాశం కల్పించినట్టు జగన్ చెప్పారు. రైతులకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, నగదు బదిలీ కాకుంటే 1902 కాల్‌ సెంటర్‌కు రైతులు ఫోన్ చేయొచ్చునని జగన్ పేర్కొన్నారు.  

ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.13,500 చొప్పున వరుసగా రైతులకు రెండో ఏడాది కూడా అందిస్తున్నట్టు తెలిపారు. దాదాపు 49,43,590కిపైగా రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.2,800 కోట్ల మొత్తం వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్టు తెలిపారు. తొలివిడత కిందే గత నెలలో రూ.2 వేల చొప్పున రూ. 875 కోట్లు జమ చేసింది ప్రభుత్వం. గత ఏడాది కన్నా ఈసారి లబ్ధి పొందే రైతు కుటుంబాల సంఖ్య 2.74 లక్షలు అధికంగా ఉన్నారు. 

మే 30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయని, రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వ్యవసాయానికి సంబంధించిన సలహాలను ఆర్‌బీకే ద్వారా అందిస్తామని జగన్ తెలిపారు. భూసార పరీక్షలు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే చేస్తామని, రైతు భరోసా కేంద్రంలో 3 రకాల ల్యాబ్‌లను కూడా అందుబాటులోకి తెస్తామని జగన్ వివరించారు.