తిరుపతి లోని బర్డ్ ఆసుపత్రిలో మే 4 సోమవారం నుంచి ఓ పీ సేవలు పునః ప్రారంభించాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించింది. లాక్డౌన్ నుంచి ఓ పీ సేవలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు నిచ్చిన నేపధ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో మే4 సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 5 కౌంటర్ల ద్వారా ఓ పీ టికెట్లు జారీ చేస్తామని బర్డ్ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఓ పీ చీటీ తీసుకున్నవారందరికీ వైద్య సేవలు అందిస్తామన్నారు.
కరోనా వ్యాప్తి చెందకుండా వైద్యులు, రోగులు మాస్క్ లు ధరించి, మూడు అడుగుల దూరం పాటిస్తారని చెప్పారు. మొదట గ్రౌండ్ ఫ్లోర్ లో రోగులకు కరోనా లక్షణాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామన్నారు. లక్షణాలు లేని 10 మంది రోగులను సహాయకులతో పాటు ఓ పీ వార్డు లోకి అనుమతిస్తామన్నారు. డాక్టర్ల సేవల తర్వాత వారందరినీ బయటకు పంపి, మళ్లీ 10 మందిని లోనికి అనుమతించేలా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.