Ap Govt
AP Govt: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను నేడు(శుక్రవారం-మార్చి4) ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కలిసి పరిశీలించనున్నారు. ఈ మేరకు ఇద్దరు నేతలు అక్కడ పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని స్పిల్ వే, ఫిష్ ల్యాడర్, కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ ప్రాంతాలను పరిశీలించి పనుల వివరాలను ఇరువురు నేతలు తెలుసుకోనున్నారు. అంతకు ముందే పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైన పునరవాస కాలనీల్లో పర్యటించనున్నారు.
సీఎంఓ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి, 10 గంటలకు కేంద్ర మంత్రితో కలిసి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు- 1 పునరావాస కాలనీకి, 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. అనంతరం 12.30 గంటలకు పోలవరం డ్యామ్ సైట్ చేరుకుని ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.
పోలవరం నిర్మాణ పనుల పరిశీలన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్న నేతలు.. సాయంత్రం 4.30 గంటలకు పోలవరం డ్యామ్ సైట్ నుంచి తిరిగి పయనమవుతారు. పోలవరం నిర్మాణ పరిశీలనకు గురువారం రాత్రే రాష్ట్రానికి చేరుకున్న కేంద్రమంత్రి షెకావత్ కు సీఎం జగన్ విందు ఏర్పాట్లు చేశారు.