Annadata Sukhibhava 3rd Installment : ఏపీలో అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చేస్తున్నాయ్.. డేట్, టైమ్ ఇదే..!
Annadata Sukhibhava 3rd Installment :
- Dharani Pilli
- Published On : March 11, 2026 / 11:44 AM IST
andhra pradesh government released annadata sukhibhava third installment funds on 2026 13th march
Annadata Sukhibhava 3rd Installment : ఆంధ్రప్రదేశ్ రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. మార్చి 13న పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మూడో విడత నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సర్వం సిద్ధం చేసింది. మార్చి 13న అస్సాం, గువాహటిలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు. అదే రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి దీన్ని అమలు చేస్తోంది. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన పేరుతో ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హులైన రైతులకు రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. ఈ మొత్తం 20 వేల రూపాయల్లో.. పీఎం కిసాన్ యోజన ద్వారా కేంద్రం ఇచ్చే రూ. 6 వేలతో పాటుగా.. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మరో రూ. 14 వేలు కలిపి మొత్తం రూ. 20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. పీఎం కిసాన్ మాదిరే.. ఏటా 3 విడతల్లో ఈ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు.
ఈ క్రమంలో పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధులను 13న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా మార్చి 13న సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని.. బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా ఏపీలో 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,808 కోట్లు జమ చేయనున్నారు. పీఎం కిసాన్ పథకం కింద రూ. 2 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ. 4 వేలు కలిపి మొత్తం రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా ప్రభుత్వం రూ. 6,309 కోట్లను రైతు కుటుంబాలకు పంపిణీ చేసింది.
