Andhra Pradesh PRC Issue : ఏపీలో పీఆర్సీ వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. కొత్తగా తీసుకొచ్చిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు భగ్గమంటున్నాయి. ఈ క్రమంలో ఏపీ హైకోర్టులో పీఆర్సీ పిటిషన్ లు దాఖలయ్యాయి. 2022, జనవరి 24వ తేదీ సోమవారం వీటిపై వాదనలు కొనసాగుతున్నాయి. పీఆర్సీ రిపోర్టు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే..ముందస్తు సమాచారం ఇవ్వకుండా జీతాలను తగ్గించిందని, HRA చట్టప్రకారం చేయలేదని పిటిషనర్ వాదించారు. కొత్త పీఆర్సీతో జీతాలు ఎంత తగ్గాయని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మెకు వెళుతామని ప్రభుత్వాన్ని ఎలా బెదిరిస్తారని ఏజీ ప్రశ్నించారు.
Read More : Open Classrooms: బహిరంగ తరగతి గదులు సిద్ధం చేస్తున్న బెంగాల్ ప్రభుత్వం
మరోవైపు…ఏపీ సీఎస్కు సమ్మె నోటీ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది పీఆర్సీ స్టీరింగ్ కమిటీ. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు స్టీరింగ్ కమిటీ సభ్యులు. మంత్రులతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని ఏపీ జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ ఆహ్వానించారని, అయితే అధికారికంగా ప్రకటించిన కమిటి పరిధి ఏంటో తెలియనప్పుడు చర్చలకు ఎలా వెళ్తామన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. పీఆర్సీ జీవోలను ఉపసంహరిస్తేనే చర్చలకు వస్తామని ఖరాఖండీగా తేల్చిచెప్పారు. ప్రస్తుతం హైకోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.