AP: ఏపీ రైతులకు బిగ్ అలర్ట్.. ఇవాళే లాస్ట్ డేట్.. మీరలా చేయకుంటే అన్నదాత సుఖీభవ డబ్బులు పడవ్..
అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించిన అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు..
- Harishth Thanniru
- Published On : July 23, 2025 / 12:11 PM IST
annadata sukhibhava
Annadata Sukhibhava Scheme: అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కోసం ఏపీ రైతులు ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యే రోజే అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పథకం కింద అర్హులైన రైతుల వివరాలను సేకరించి.. అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాలు, అన్నదాత సుఖీభవ వెబ్ సైట్ లో పొందుపర్చారు. అయితే, అర్హత ఉన్నప్పటికీ తుది జాబితాలో పేర్లురాని రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆ గడువు ఇవాళ్టితో ముగియనుంది.
అన్నదాత సుఖీభవకు సంబంధించిన అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు గ్రామ వ్యవసాయ సహాయకులు వద్ద గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయాలని ఇప్పటికే ఏపీ వ్యవసాయశాఖ సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేనివాళ్లు ప్రభుత్వం చెప్పినట్లు తమ పేర్లను రూల్స్ ప్రకారం నమోదు చేయించుకున్నారు. ఇంకా ఎవరైనా రైతులు ఉంటే ఇవాళ్టితో లాస్ట్ డేట్ అని.. వెంటనే సంబంధిత అధికారులను కలిసి పథకంకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
అన్నదాత సుఖీభవ పథకం దరఖాస్తు చేసుకున్న రైతులు.. వారి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు 155251 అనే నెంబర్ కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెంబర్ కు ఫోన్ చేస్తే మీ అప్లికేషన్ ఏ స్టేజ్ లో ఉంది అనే వివరాలను తెలియజేస్తారు.
నిధుల విడుదల ఎప్పుడు..?
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడుతల్లో రెండు వేలు చొప్పున ఏడాదికి రూ.6వేలు జమ చేస్తుంది. వీటికితోడు అన్నదాత సుఖీభవ కింద ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.14వేలు చెల్లించనుంది. వీటిని మూడు విడుతల్లో అందించనుంది. దీంతో తొలి విడతలో కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు మొత్తం రూ.7వేలు రైతుల అకౌంట్లలో జమకానున్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు రెండో తేదీన వారణాసిలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా 20వ విడత పీఎం కిసాన్ నిధులు జమ అవుతాయని తెలుస్తోంది. అదే సమయంలో అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాల్లో పడనున్నాయి.
