కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా : నన్నెవరూ పట్టించుకోవట్లేదు..దేనికీ పిలవట్లేదంటూ ఆవేదన
- nagamani
- Published On : January 18, 2021 / 03:33 PM IST
AP : YCP mla roja emotional : వైసీపీ ఫైర్ బ్రాండ్..నగరి ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టుకున్నారు. తనను ఎవ్వరూ పట్టించుకోవట్లేదనీ..పార్టీ కార్యక్రమాలకు తనను ఎవ్వరూ పిలవట్లేదని కన్నీంటిపర్యంతమయ్యారు. ఏపీ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. కలెక్టర్ సహా ఎవరూ తనను పట్టించుకోవడం లేదని.. నియోజకవర్గ సమస్యలు, ప్రోటోకాల్ విషయంలో అధికారుల తీరుపై కమిటీకి ఫిర్యాదు చేశారు.
తనకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల సమావేశానికి తనను ఆహ్వానించలేదని.. అధికారులు తనకు తెలియకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని..ఓ ఎమ్మెల్యేగా ఇది నాకు అవమానమని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్ కమిటీ ముందే ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. రోజా ఫిర్యాదుపై కమిటీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
రోజా ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ..ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని రోజా ఫిర్యాదు చేశారని..అన్ని విషయాలకు జిల్లా కలెక్టర్కు చెప్పామని.. అవన్నీ సరిచేస్తామని తెలిపారు. ఇక ఇటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చెప్పారని కాకాణి తెలిపారు.
