CM Jagan Delhi Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నారు సీఎం జగన్. ఈ రాత్రికి ఢిల్లీలో తన నివాసంలో బస చేస్తారు. సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో మోదీతో జగన్ కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే పోలవరం నిర్వాసితుల సమస్య, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, సవరించిన అంచనాలకు ఆమోదం పైన ప్రధానికి వివరించనున్నారు. అలాగే, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను అమలు చేయాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరనున్నారని సమాచారం. మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా.. నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన ధన్ ఖడ్ తోనూ సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ రెండు ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముర్ము, ధన్ ఖడ్ కు వైసీపీ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. ఇప్పుడు మరోసారి పీఎంతో భేటీ కానుండటం రాష్ట్ర రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.