Kottu Satyanarayana: పవన్ కల్యాణ్ ఏమైంది నీకు? ఇలా చేస్తున్నావ్?: ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
ఇప్పుడు పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర పేరుతో బయలుదేరి, సంధి ప్రేలాపనలు పేల్చుతున్నారని చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : June 18, 2023 / 04:20 PM IST
Kottu Satyanarayana
Kottu Satyanarayana – YCP: పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) ఏమైంది నీకు? అంటూ జనసేన (JanaSena) అధినేతని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. ఇవాళ ఏలూరులో కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. పాలిచ్చే ఆవుని కాదంటూ తన్నే దున్నపోతుని పవన్ కల్యాణ్ కావాలంటున్నారని చెప్పారు.
సీఎం జగన్ పాలనలో ఏపీలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని కొట్టు సత్యనారాయణ అన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర పేరుతో బయలుదేరి, సంధి ప్రేలాపనలు పేల్చుతున్నారని చెప్పారు. ” వీడికేమైందిరా బాబు.. అతడిని ఎవరికైనా చూపించాండ్రా బాబు ” అని అందరూ అనుకుంటున్నారని తెలిపారు.
జగన్కు దేవుడి ఆశీర్వాదం..
దేవుడి ఆశీర్వాదం జగన్ కు ఉందని చెప్పారు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలో ఆ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం పవన్ తింగరితనమని అన్నారు. కాపుల ఓట్ల కోసమే పవన్ ను చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ సీఎం అవ్వనని అంటే కాపులు ఆయన వెనుక రారని చెప్పారు.
అందుకే సీఎం అవుతానని చంద్రబాబు చెప్పమంటే పవన్ కల్యాణ్ అదే విధంగా చెబుతున్నారని అన్నారు. ఏపీలోని 175 నియోజక వర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని పవన్ చెప్పాలని సవాలు విసిరారు. అలా చేస్తేనే ప్రజలు పవన్ ను నమ్ముతారని అన్నారు.
