ap dgp goutam sawang: జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడికి సంబంధించి టీడీపీ చీఫ్ చంద్రబాబు రాసిన లేఖపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. చంద్రబాబుకు, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘటుగా సమాధానం ఇచ్చారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడిలో వాస్తవాలకు విరుద్ధంగా చంద్రబాబు లేఖ ఉందన్నారు. ఈ దాడిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదన్నారు. వైసీపీకి అసలు సంబంధమే లేదని డీజీపీ స్పష్టం చేశారు.
దాడి చేసిన వ్యక్తి టీడీపీకి బలమైన అనుచరుడు:
నిజానిజాలు తెలుసుకోకుండానే, వాస్తవాలను ధృవీకరించకుండానే ఆరోపణలు చేయడం సరికాదన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. వాస్తవానికి రామచంద్రపై దాడి చేసిన ప్రతాప్ రెడ్డి టీడీపీకి బలమైన అనుచరుడని తమ విచారణలో తేలిందన్నారు. దాడి సమయంలో రామచంద్ర మద్యం సేవించి ఉన్నాడని.. రామచంద్ర చేసిన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. సాక్షుల వాంగ్మూలం, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ప్రతాప్రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ చట్టప్రకారమే పని చేస్తోందన్నారు.
ఈ విషయంలో చంద్రబాబు దగ్గర ఆధారాలు ఉంటే, వాటిని సీల్డ్ కవర్లో పంపితే విచారణ చేస్తామన్నారు. నిజాలు తెలుసుకోకుండానే బహిరంగ లేఖలు రాయడం సరికాదన్నారు డీజీపీ. అలా చేస్తే, జరుగుతున్న విచారణకు ఆటంకం కలుగుతుందన్నారు. ఆధారాలు ఉంటే, కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్న చంద్రబాబు:
జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో చోటుచేసుకుంది. దుండగుల దాడిలో రామచంద్రకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బి.కొత్తకోట జడ్పీ హైస్కూల్ సమీపంలో తోపుడు బండి దగ్గర రామచంద్ర పండ్లు కొనుగోలు చేస్తున్న సమయంలో దుండగులు కారులో వచ్చి గాయపరిచారు.
అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి చేసింది వైసీపీ నేతలే అని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆరోపిస్తూ ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ఆ లేఖకు గౌతమ్ సవాంగ్ కౌంటర్ ఇచ్చారు.