AP Government: వంట కార్మికులకు శుభవార్త.. బకాయిలు విడుదల, నేరుగా ఖాతాల్లోకి నగదు
స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన వంట కార్మికులను తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వం(AP Government) తేల్చిచెప్పింది.
- V Santhosh Kumar
- Published on- June 28, 2026 / 07:20 PM IST
AP Government makes key announcement regarding Smart Kitchen and wages of kitchen workers.
- వంట కార్మికులను తొలగించే ప్రసక్తేలేదు
- రూ.350 కోట్ల బకాయిలు విడుదల
- కార్మికుల ఉపాధికి పూర్తి భరోసా
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న ‘స్మార్ట్ కిచెన్స్’ విధానంపై కొందరు రాజకీయ స్వార్థంతో చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారాలన్నీ ముమ్మాటికీ అవాస్తవాలని, కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర మాత్రమేనని మధ్యాహ్న భోజన పథకం విభాగం స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు మరింత సమర్థవంతంగా, అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలనే ఏకైక సంకల్పంతోనే ప్రభుత్వం ‘స్మార్ట్ కిచెన్స్’ విధానాన్ని పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు. ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థుల ఆరోగ్య భద్రతను మెరుగుపరచడమే ప్రభుత్వ(AP Government) ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.
Helicopter Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన అరామ్కో హెలికాప్టర్.. 14 మంది దుర్మరణం
వంట కార్మికులకు పూర్తి ఉపాధి భద్రత:
స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన వంట కార్మికులను తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా, ఒక్క కుక్ను కూడా తొలగించే ప్రసక్తే లేదని హామీ ఇచ్చింది. దశాబ్దాలుగా పాఠశాలల్లో సేవలు అందిస్తున్న దాదాపు 85 వేల మంది అక్కచెల్లెమ్మల సేవలను ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుందని పేర్కొంది. వారి సంక్షేమానికి, ఉపాధి భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కార్మికుల పొట్ట గొట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి అస్సలు లేదని పునరుద్ఘాటించింది. కార్మికులు ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.
పెండింగ్ బకాయిల విడుదల:
మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పటికే ఏప్రిల్ నెల వరకు గౌరవ వేతనాలను పూర్తిగా చెల్లించామని, మిగిలిన స్వల్ప బకాయిలను కూడా త్వరితగతిన నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం వివరించింది. గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన దాదాపు రూ. 350 కోట్ల రూపాయల పైచిలుకు బకాయిలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా విడుదల చేసిందని గుర్తు చేసింది. ఈ నిధులలో పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, నైట్ వాచ్మెన్ల జీతాలతో పాటు, విద్యార్థులకు అందించే గుడ్లు, చిక్కీలు, శానిటరీ నాప్కిన్ల వెండర్లకు సుదీర్ఘకాలంగా ఇవ్వాల్సిన పాత బకాయిలు కూడా కలిసి ఉన్నాయని, దీనివల్ల లబ్ధిదారులందరికీ పెద్ద ఉపశమనం లభించిందని వివరించింది.
