Talliki Vandanam Scheme : తల్లికి వందనం పథకంపై మరో కీలక అప్డేట్.. ఈసారి వాళ్లకు మాత్రమే డబ్బులు.. తప్పనిసరిగా ఇలా చేయండి.. టైమ్ రెండ్రోజులే..!
Talliki Vandanam Scheme : తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. విద్యార్థులకు పాన్ కార్డు లేకపోయినా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ద్వారా వారి పేరుతో బ్యాంక్ ఖాతా తెరవొచ్చని ప్రభుత్వం వెల్లడించింది.
- Harish Thanniru
- Published on- July 14, 2026 / 01:25 PM IST
Talliki Vandanam Scheme
- తల్లికి వందనం పథకంపై ఏపీ సర్కార్ మరో కీలక అప్డేట్
- ఎస్సీ విద్యార్థులకు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి
- ఎన్పీసీఐ సీడింగ్ తప్పనిసరి
Talliki Vandanam Scheme : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 16, 17, 18 తేదీల్లో ఈ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేయనుంది.
తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.15వేలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. అయితే, రూ.15వేలలో రూ.13వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్న ప్రభుత్వం.. మిగిలిన రూ.2వేలు పాఠశాల నిర్వహణ నిధి (మెయింటెనెన్స్ ఫండ్) ఖాతాకు బదిలీ చేస్తుంది. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ పథకం డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. అయితే, డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడాలంటే కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచించింది.
ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. అయితే అర్హులైన ఎస్సీ విద్యార్థులకు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా ఉండాలని సూచించింది. ఎన్పీసీఐ మ్యాపింగ్ చేసుకోవాలని ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. ఎన్పీసీఐ సీడింగ్ చేసుకోకపోతే డీబీటీ ప్రక్రియ ద్వారా డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడవు. ఇంటర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు లేవు. కొంతమందికి ఉన్నా ఎన్ పీసీఐ చేయలేదు. దీని వల్ల తల్లికి వందనం డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉంది.
విద్యార్థులకు పాన్ కార్డు లేకపోయినా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ద్వారా వారి పేరుతో బ్యాంక్ ఖాతా తెరవొచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఆధార్ కార్డు, జనన తేదీ ధ్రువీకరణ పత్రం వంటి పత్రాలతో సమీప పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు. కేవలం రూ.200 ప్రారంభ డిపాజిట్ చెల్లించి ఖాతా ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పోస్టాఫీసులో ఖాతా తెరిస్తే 24గంటల్లోనే ఎన్ పీసీఐకు అనుసంధానం అవుతుంది. ఇంటర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా వెంటనే అకౌంట్ తెరవాలని ప్రభుత్వం సూచించింది. ఒకసారి అకౌంట్ తెరిస్తే ఇంటర్ సెకండియర్లో తల్లికి వందనం నిధులు అందుకోవడంలో ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది.
