Amma Vodi Laptops : విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు, ప్రభుత్వం ఉత్తర్వులు
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వాలని నిర్ణయించింది.
- Naveen
- Published On : July 9, 2021 / 06:57 AM IST
Amma Vodi Laptops
Amma Vodi Laptops : ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వాలని నిర్ణయించింది. అమ్మఒడి పథకం కింద ఇస్తున్న నగదును వద్దనుకున్న వారికే ల్యాప్ టాప్ లు ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. డ్యుయెల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 అంగుళాల(ఇంచ్) స్క్రీన్, విండోస్ 10 (ఎస్టీఎఫ్ మైక్రోసాఫ్ట్), ఓపెన్ ఆఫీస్ (ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్)ల కాన్ఫిగరేషన్తో ల్యాప్టాప్లు అందించనుంది.
వీటికి మూడేళ్ల వారెంటీ ఉంటుంది. ల్యాప్టాప్లకు మెయిన్టెనెన్స్ సమస్యలు ఎదురైతే ఫిర్యాదు ఇచ్చిన వారంలోపు పరిష్కరించేలా సదరు కంపెనీకి షరతు విధిస్తున్నారు. ఏవైనా సమస్యలు వస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన పథకాల్లో అమ్మ ఒడి ఒకటి. నవరత్నాల్లో భాగంగా ఈ స్కీమ్ను ప్రకటించారు సీఎం జగన్. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందుతుంది.
అమ్మ ఒడి స్కీమ్ అర్హతకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే లబ్ధిదారులకు ఆధార్ కార్డు తప్పనిసరి. స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి. ఒకవేళ పిల్లలు మధ్యలో తమ చదువును నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు. ఆర్థిక సాయాన్ని తిరిగి అందుకోవాలంటే పాఠశాలకు పిల్లలు తిరిగి హాజరు కావాలి.
