Gender Budget
Gender Budget : ఏపీ ప్రభుత్వం మొదటిసారి మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇంతకుముందు ఎక్కడా లేని విధంగా జెండర్ బడ్జెట్ ను సభకు సమర్పించబోతోంది. సీఎం జగన్ నిర్ణయం పట్ల వైసీపీ మహిళా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సీఎంలుగా పని చేస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు జెండర్ బడ్డెజ్ ప్రవేశపెట్ట లేదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సీఎం జగన్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ముఖ్యమంత్రి అన్ని చర్యలు చేపడుతున్నారని చెప్పారు. వైఎస్ఆర్ చేయూత లాంటి పథకాలతో మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం ప్రవేశపెట్టారని చెప్పారు. రాజకీయంగా మహిళలకు సీఎం జగన్ మెరుగైన అవకాశాలు ఇచ్చారని మంత్రి వనిత చెప్పారు.
ఏపీ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. జెండర్ బేస్డ్ బడ్జెట్ పేరుతో ఎవరి కేటాయింపులు వారికి నేరుగా చేరేలా ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జెండర్ బేస్డ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇందులో పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు జరపనుంది జగన్ ప్రభుత్వం. దీని ఆధారంగానే ప్రతిపాదనలు కూడా స్వీకరించింది. ఫస్ట్ టైం ఈ తరహా బడ్జెట్ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం(మే 20,2021) శాసనసభకు సమర్పించనున్నారు.
రేపు ఉదయం 9గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వర్చ్యూవల్ పద్దతిలో ప్రసంగిస్తారు. ఈ ప్రసంగం తర్వాత 2021-22 ఆర్ధిక బడ్జెట్ను రాజేందర్ ప్రవేశపెడతారు. ఇప్పటికే 3 నెలల కాలానికి 70వేల 983.11 కోట్ల అంచనాతో ఓటాన్ అకౌంట్ను అర్డినెన్స్ రూపంలో ఆమోదించారు. మిగిలిన 9 నెలల కాలానికి పూర్తి స్థాయి ఆర్ధిక బడ్జెట్ ఇది. కరోనా కారణంగా ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి పిల్లలు, మహిళల కోసం కేటాయింపులను ఒక నివేదిక రూపంలో సమర్పించనుంది. గతంలోనే ఈ నిర్ణయం తీసుకుని అన్ని శాఖల నుంచి ఇదే తరహాలో ప్రతిపాదనలు స్వీకరించింది. 18 ఏళ్లలోపు పిల్లలపై వివిధ పథకాల ద్వారా రాష్ట్రం ఎంత వెచ్చిస్తుందో విడిగా లెక్కలు కట్టి తాజా బడ్జెట్లో ప్రత్యేకంగా నివేదించనుంది ప్రభుత్వం. మహిళల పథకాలకు కేటాయింపులు విడిగా మహిళలు, బాలికల సంక్షేమ పథకాలు, కేటాయింపులను కూడా విడిగా చూపించనున్నారు.
జెండర్ బేస్డ్ బడ్జెట్ను తొలిసారి ఏపీ సర్కార్ ప్రవేశపెడుతోంది. మహిళలకు, పిల్లలకు ప్రత్యేక బడ్జెట్ పెట్టబోతోంది. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశా, కేరళ, అసోం, బీహార్, ఛత్తీస్గడ్, త్రిపుర, నాగలాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు జెండర్ బేస్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టాయి.