Assigned Lands Case: అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు ఊరట.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!
రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల(Assigned Lands Case) వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పొంగూరు నారాయణలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది.
- V Santhosh Kumar
- Published on- July 15, 2026 / 02:44 PM IST
AP High Court delivers a sensational verdict, quashing the assigned lands case against Chandrababu!
- బాబు, నారాయణకు భారీ ఊరట
- సీఐడీ కేసు కొట్టేసిన హైకోర్టు
- ఆళ్ల పిటిషన్లో ఆధారాలు లేవు
Assigned Lands Case: రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పొంగూరు నారాయణలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో వీరిద్దరిపై సీఐడీ నమోదు చేసిన క్రిమినల్ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ హైకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
గతంలో వైకాపా ప్రభుత్వ హయాంలో.. అమరావతి అసైన్డ్ భూముల (Assigned Lands Case)కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ వైకాపా నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24న సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు, నారాయణలపై ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం (POT)తో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై చంద్రబాబు, నారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు.. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ఎటువంటి వాస్తవాలు, ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నమోదు చేసినట్లు భావిస్తూ, సీఐడీ ఎఫ్ఐఆర్ను పూర్తిగా కొట్టివేసింది (డిస్మిస్ చేసింది). ఈ తీర్పుతో చంద్రబాబు, నారాయణలకు చట్టపరంగా పెద్ద ఉపశమనం లభించినట్లయింది.
