Ap Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ సూచన

దీని ప్రభావంతో మంగళవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు (Ap Rains)కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Meteorological Department warns heavy rain accompanied by thunder and lightning in Andhra Pradesh

  • రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల విస్తరణ.
  • పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక.
  • ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన.

Ap Rains: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. జూన్ 15 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఇవి విస్తరించినట్లు పేర్కొంది. దీని ప్రభావంతో మంగళవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు (Ap Rains)కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కోస్తాంధ్రలోని మిగతా ప్రాంతాలతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చని అంచనా వేశారు.

No Test No Licence: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏజెంట్ ద్వారా వెళ్తున్నారా? మీకో బ్యాడ్ న్యూస్..

రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గుండె జబ్బులు, షుగర్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎండలో ఎక్కువగా తిరగవద్దని సూచించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ప్రజలు చెట్లు, భారీ హోర్డింగ్స్ కింద నిలబడకూడదని హెచ్చరించింది. ముఖ్యంగా పొలాల్లో పనులు చేసుకునే రైతులు, కూలీలు, పశువుల కాపరులు పిడుగుల బారిన పడకుండా తగిన అప్రమత్తతతో ఉండాలని అధికారులు కోరారు.

వర్షాల కారణంగా ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడితే వాటికి దూరంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలను కోరారు. కాగా, గత 24 గంటల్లో అనకాపల్లి జిల్లా కన్నూరుపాలెంలో అత్యధికంగా 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.