ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాపై అత్యాచారం, హత్య జరిగి డిసెంబర్ 27వ తేదీకి 12 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ కేసు కొనసాగుతూనే ఉంది. దీంతో ఆయేషా మీరా తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఆందోళనలు, నిరసనలు చేశారు. అయితే..ఈసారి మాత్రం సత్యాగ్రహం చేయాలని డిసైడ్ అయ్యారు. విజయవాడలోని ధర్నా చౌక్లో 27వ తేదీన సత్యాగ్రహం చేయాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు నిర్ణయించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపకూడదన్న ఉద్దేశంతోనే ఈ దీక్ష చేయనున్నట్టు ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ బాషా చెప్పారు.
ఆయేషా మీరా కేసు :-
* కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గ లేడీస్ హాస్టల్లో 2007 డిసెంబర్ 27 న బి ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్యకు గురైంది.
* ఈ కేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
* కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి.
* కేసును విచారించిన పోలీసులు.. సత్యంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతనే ప్రధాన నిందితుడని చెప్పారు.
* 2010లో విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. సత్యంబాబును దోషిగా తేల్చింది.
* అయితే..ఉన్నత న్యాయస్థానం 2016లో సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది.
* ఆయేషా మీరా హత్య కేసును మళ్లీ విచారణ చేయాలంటూ సీబీఐకి హైకోర్టు ఆదేశించింది.
* విజయవాడ కోర్టు కస్టడీలో ఉన్న ఆయేషా మీరా కేసు ఆధారాలను నాశనం చేశారంటూ ఆయేషా మీరా తల్లి హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు.
* సత్యంబాబును మరోసారి విచారించారు సీబీఐ అధికారులు.
* 12 ఏళ్ల తర్వాత 2019 జులై నెలలో ఆయేషా మీరా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని సీబీఐ భావించింది.
* 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట ఈద్గాలో అధికారులు పోస్టుమార్టం చేశారు.
Read More : ఎలాంటి తీర్పు వస్తుందో : హాజీపూర్ వరుస హత్యల కేసు..వాదనలు పూర్తి