Kalyana Mahotsavam in Srisailam : ఆశేష భక్తజన సందోహం మధ్య శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగ్గా సాగింది. శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, భ్రమరాంబికలకు వేదమంత్రాల నడుమ పురోహితులు శాస్త్రోక్తంగా వివాహాన్ని జరిపించారు. శివరాత్రి పర్వదినాన శ్రీశైలంలో ఎక్కడ చూసినా.. భక్తుల సందడే కనిపించింది.
పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు పాతాల గంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ పురవీధుల్లో స్వామి, అమ్మవార్లు నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో పురోహితులు వైభవంగా మహాలింగార్చన నిర్వహించారు. రాజన్న ఆలయానికి శివ మాలధారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శివ స్వాముల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన సమయాన్ని కేటాయించారు.