మరోసారి రెచ్చిపోయిన బీజేపీ నేత : కరోనా నిబంధనలను ఉల్లంఘించి తుంగభద్ర పుష్కరఘాట్ లో స్నానం

  • Publish Date - November 21, 2020 / 02:22 PM IST

Buddha Srikanth violates corona rules : ‘నేను సీతయ్య.. ఎవ్వరి మాట వినను’ అంటూ ఓ బీజేపీ నేత హల్ చల్ చేస్తున్నాడు. ‘నేను చెప్పిందే వేదం…నా మాటే శాసనం అంటూ’ హుకుం జారీ చేస్తున్నాడు. ఆయనే కర్నూలు జిల్లా నంద్యాల బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్. కొద్ది రోజుల క్రితం కరోనా నిబంధనలు ఉల్లంఘించి మహానంది పుణ్యక్షేత్రంలో తనదైన శైలిలో ఓవరాక్షన్ చేశాడు. ఏకంగా గర్భగుడిలో పూజారిపై దౌర్జన్యం చేశాడు.



శ్రీకాంత్ మరోసారి రెచ్చిపోయాడు. తాజాగా సప్తనది సంగమేశ్వరం తుంగభద్ర పుష్కరఘాట్ లో పోలీసులపై విరుచుకుపడ్డారు. కరోనా కారణంగా తుంగభద్ర పుష్కరఘాట్ కు వెళ్లే భక్తులు ఎవరూ స్నానాలు ఆచరించకూడదని అధికారులు నిబంధనలు విధించారు. వాటిని పట్టించుకోని శ్రీకాంత్ అక్కడి పోలీసులపై చిందులేశారు.



వైసీపీ నాయకులు పాదయాత్రలు, భారీ బహిరంగ సభలు పెట్టుకున్నప్పుడు రానీ కరోనా నదిలో స్నానాలు చేస్తే వస్తుందా అంటూ లాజిక్కులు లాగారు. తుంగభద్ర పుష్కరఘాట్ లో నాకు నచ్చిందే చేస్తానంటూ హల్ చల్ చేశారు. స్నానమాచరించి తీరుతానని ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు.



అక్కడున్న భక్తులను సైతం తనతోపాటు తీసుకెళ్లి నదిలో స్నానాలు చేయించారు. శ్రీకాంత్ ఓవరాక్షన్ కు సమాధానం చెప్పలేని పోలీసులు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. అతన్ని అడ్డుకునే సాహసం చేయలేక చూస్తూ ఉండిపోయారు.