Mother Kills Daughter
Mother Kills Daughter : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడు మోజులో ఓ మహిళ తన కన్న కుమార్తెను హత్య చేసింది. అక్రమ సంబంధంకు అడ్డొస్తుందన్న నెపంతో అభంశుభం తెలియని పసికందును బలి తీసుకొని మాతృత్వానికే మాయని మచ్చ తెచ్చింది. ఈ ఘటన తిరుపతి నగరంలోని పోస్టల్ కాలనీలో చోటు చేసుకుంది.
Also Read : రఘురామ టార్చర్ ఇష్యూ.. ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టులో బిగ్ ట్విస్ట్
పోస్టల్ కాలనీలో ఉంటున్న ఆశా, రాజేందర్ దంపతులకు రెండేళ్ల పాప ఉంది. కొంతకాలం క్రితం భర్త రాజేశ్తో ఆమె విడిపోయింది. ఆ తరువాత ఆశాకు నగరంలోని చెన్నాయుగుంటకు చెందిన రెడ్డి కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ బంధానికి పాప అడ్డుగా ఉందని ఆశాతో పలుసార్లు ప్రియుడు రెడ్డి కుమార్ గొడవపడ్డాడు. దీంతో ప్రియుడు కోసం ఏకంగా రెండేళ్ల కుమార్తెను తల్లి చంపేసింది.
మనవరాలు కనిపించడం లేదని ఆశ తల్లి నాగరత్నమ్మ ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నాగరత్నమ్మ ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించగా.. తల్లి ఆశాను ప్రశ్నించారు. ఆమె ప్రవర్తనలో అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో ఆమెను విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు నిందితురాలు ఆశాను అదుపులోకి తీసుకున్నారు. కుమార్తెను హత్యచేసిన తరువాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని పాపానాయుడు పేట సమీపంలోని స్వర్ణముఖి నది తీరానికి తీసుకెళ్లి అక్కడ పాతిపెట్టినట్లు గుర్తించారు.
ఒక పసిపాప ప్రాణాలను తీసి ఏమీ ఎరుగనట్టు ప్రవర్తించి, సాక్ష్యాలను మాయం చేసేందుకు వారు చేసిన ప్రయత్నం విస్తుగొలుపుతోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాజంలో బంధాలకు అర్థం లేకుండా పోతోందని, ఇలాంటి కిరాతకులకు కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.