Chandrababu Naidu : కడప మాధవి రెడ్డి, పిఠాపురం వర్మకు చంద్రబాబు వార్నింగ్?
Chandrababu Naidu : ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు క్లాస్ పీకారు. చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు.. ప్లెక్సీల దగ్గర, ఫొటోల దగ్గర, కుర్చీల దగ్గర గొడవలొద్దు. అందరూ మనస్పర్థలు లేకుండా పని చేయాలని సూచించారు.
- Harish Thanniru
- Updated on- April 29, 2026 / 01:11 PM IST
Chandrababu Naidu
- టీడీపీలోని కొందరు నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్
- చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు..
- ఫ్లెక్సీల దగ్గర, ఫొటోల దగ్గర, కుర్చీల దగ్గర గొడవలొద్దు
- అందరూ మనస్పర్థలు లేకుండా పని చేయాలి
Chandrababu Naidu : ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు క్లాస్ పీకారు. బుధవారం టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు తీసుకున్నారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కీలక కామెంట్స్ చేశారు.
Also Read : Chandrababu Naidu : తగ్గేదేలే.. మీసం మెలేస్తాం.. చంద్రబాబు నాయుడు అదిరిపోయే స్పీచ్.. లోకేశ్ పై ప్రశంసల జల్లు
సొంత బాబాయి వివేకానంద రెడ్డిని హత్యచేసి నెపం మనపై నెట్టారు. వాళ్ల కార్యకర్తను కారుతో తొక్కించి.. ఆ పాపాన్ని మనపైకే నెట్టారు. కబ్జా చేసిన ఆస్తుల కోసం కడపలో అనుచరుడినే చంపేశారు. వాస్తవాలు బయటపడితే ఎదురు దాడి చేస్తున్నారు. నా జీవితంలో రాజకీయ నేతలతో పోరాడాను.. కానీ, నేరస్తులతో పోరాడలేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలిసారిగా నేరస్తులతో పోరాడుతున్నాం. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తుంచుకోవాలి. మనది అభివృద్ధి.. వాళ్లది అవినీతి.. మనది వికాసం.. వాళ్లది విధ్వంసం. మనం రిలాక్స్ అయితే.. అబద్దాలు ప్రపంచమంతా తిరుగుతాయి. అందుకే ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.
తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ. కార్యకర్తల నుంచి అధ్యక్షుడి వరకు క్రమశిక్షణతో పని చేయడం పార్టీ మూల సిద్ధాంతం. ప్రజలతో సౌమ్యంగా ఉండాలి. అందుబాటులో ఉండాలి. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాలి. నేతలు, కార్యకర్తలు తప్పు చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి చెద్దపేరు వస్తుందని గుర్తుంచుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి.. నేను చాలా బాధపడ్డాను. మనం యజ్ఞం చేస్తున్నాం.. మన వాళ్లు కూడా సరిగా వ్యవహరించకుంటే బాధ కలుగుతుంది.
నేను, పవన్ కల్యాణ్ చక్కగా ఉంటున్నాం. మంచి రిలేషన్ కొనసాగిస్తున్నాం. ఇదే మాదిరిగా క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా వ్యవహరించాలి. మరోవైపు బీజేపీని కలుపుకొని వెళ్లాలి. రాష్ట్రానికి, కేంద్రానికి గ్యాప్ లేదు.. రాకూడదు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా గ్రామ స్థాయి కార్యకర్తలు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నేతలు, కార్యకర్తలు అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు. గతంలో పాలకుల గర్వాన్ని, అహంకారాన్ని చూశాం.. ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారు. బూతులు, వివాదాలు, దాడులు, గొడవలు, సెటిల్మెంట్లకు దూరంగా ఉందాం. మనకు ప్రజలు సహకరించారు.. నమ్మకం పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రజలు మనల్ని గమనిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎవరైనా అధికారం ఉందని ఇగోలకు పోతే భవిష్యత్తులో నష్టం జరుగుతుంది. చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ప్లెక్సీల దగ్గర, ఫొటోల దగ్గర, కుర్చీల దగ్గర గొడవలొద్దు. ప్రధాని కార్యక్రమంలో సెక్యూరిటీ తన పని తాను చేస్తాడు. ఇలాంటి వాటి కోసం గొడవ పడొద్దు అంటూ ఇటీవల వివాదాలకు కారణమైన నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. సత్ప్రవర్తనను నేతలు తమ కింద వాళ్లకు కూడా నేర్పించాలి. కీలక పదవుల్లో ఉన్న వారు తప్పు చేస్తే మీడియాలో హెడ్డింగులు వస్తాయి.. అనునిత్యం పని చేయడంతోపాటు.. పార్టీ క్రమశిక్షణను కూడా కాపాడాలి. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా ఉండొద్దు.. మళ్లీమళ్లీ ఎన్నిక కావాలి అని చంద్రబాబు సూచించారు.
అందరూ మనస్పర్థలు లేకుండా పనిచేయాలి. తాను లేకుండా ఎంపీ రాకూడదని ఎమ్మెల్యేలు అనడం కరెక్ట్ కాదు. టికెట్ ఇచ్చిన వారి వెంటే కార్యకర్తలు ఉంటారు.. లీడర్లు వెనుక ఉండరు.. ఇదే టీడీపీ స్పెషాలిటీ అని చంద్రబాబు అన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన అభివృద్ధి, పడిన కష్టాన్ని ప్రజలకు చెబుదాం. స్థానిక సంస్థల ఎన్నికలు వన్ సైడ్ గా ఉంటాయి. ప్రతీది నిష్టతో, మనస్సుతో, భవష్యత్తు కోసం పనిచేయాలి. మరో మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. 2024లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు రావాలి. అప్పుడే బాగా పనిచేసినట్లు. ఓటు బ్యాంక్ నిత్యం పెరుగుతూనే ఉండాలి. పార్టీ ప్రతిష్ట పెరిగేలా ప్రతి ఒక్కరూ పని చేయాలి. పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగుదేశం బాగుంటే.. రాష్ట్రం బాగుంటుంది. మళ్లీ వైకుంఠపాళి అయితే.. రాష్ట్రానికి నష్టం. పర్మిషన్లతో పదవులు ఇవ్వరు.. పని చేసిన వారికే పదవులిస్తాం. అన్నీ తెలుసని తప్పులు చేయొద్దు.. నేర్చుకుందాం. రాష్ట్రానికి ఉపయోగపడదాం అని సీఎం చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
