Cm Jagan
CM Jagan Delhi Tour : పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధుల కేటాయింపు చేయాలన్నారు. 2021, జూన్ 10వ తేదీన ఢిల్లీకి వచ్చిన సీఎం జగన్ బిజీ బిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. హస్తిన పర్యటనలో ఉన్న జగన్… గజేంద్రసింగ్ షెకావత్ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు జగన్. 2022లో ఖరీఫ్ సీజన్ నాటికి పోలవరం నుంచి నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధుల విడుదలకు చొరవ చూపాలని కోరారు జగన్.
అంతకుముందు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్తో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు సైతం ఇద్దరి మధ్య చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. మరికొంత మంది కేంద్రమంత్రులతోనూ జగన్ భేటీకానున్నారు. రాత్రి 7 గంటలకు ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశం అవుతారు. ఇక రాత్రి 9 గంటలకు కేంద్రహోంమంత్రి అమిత్షాను జగన్ కలుస్తారు. మూడు రాజధానులపై ఆయనతో చర్చించనున్నారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపైనా చర్చించనున్నట్టు తెలుస్తోంది. రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్న జగన్.. రేపు మరికొంత మంది కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది.
పోలవరం పీపీఏతోపాటు, కేంద్ర జలమండలి సిఫార్సులతోపాటు, కేంద్ర జలశాఖకు చెందిన సాంకేతిక సలహామండలి (టెక్నికల్అడ్వైజరీ కమిటీ – టీఏసీ) అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం రూ. 55,656.87 కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని కోరారు. 2022 జూన్ నాటికి ప్రాజెక్టు పనులతో పాటు, భూసేకరణ – పునరావాస పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, వెంటనే ఈ అంచనాలకు ఆమోదం తెలపాలన్నారు.
జాతీయ ప్రాజెక్టుల విషయంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం వాటర్ సప్లైని కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వనరులనుంచి పోలవరం ప్రాజెక్టుకోసం ఖర్చు చేస్తున్నామని, జాప్యం లేకుండా ఆ నిధులను రీయింబర్స్ చేయాలని కోరారు. రీయింబర్స్మెంట్ను కాంపోనెంట్ వైజ్ ఎలిజిబిలిటీకి పరిమితం చేయవద్దని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం తరలించాలన్నారు. హైదరాబాద్లో ఇప్పుడు సచివాలయ కార్యకలాపాలు లేవని, ప్రాజెక్టు పర్యవేక్షణ, పరిశీలనకోసం సుదూరంలో ఉన్న హైదరాబాద్ నుంచి రావడం కష్టం అవుతోందని, అందుకే పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రి తరలించాలన్నారు.
Read More : Etela To Join BJP : జూన్ 14న బీజేపీలో చేరనున్న ఈటల.. ముహూర్తం ఖరారు..