CM Jagan Tanuku tour : ఏపీ సీఎం జగన్ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించనున్నారు సీఎం. ఇవాళ ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. 11 గంటలకు తణుకు చేరుకుంటారు. జడ్పీ బాలుర హైస్కూల్లో జరిగే బహిరంగ సభకు సీఎం జగన్ హాజరు కానున్నారు.
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించి… మధ్యాహ్నం తిరిగి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ఏపీలో రిజిస్ట్రేషన్ లేని ఇళ్లపై యజమానులు పూర్తి హక్కు పొందేందుకు ఈ పథకం తీసుకొచ్చింది ప్రభుత్వం. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ కింద లబ్ధిదారుల నుంచి ఇప్పటికే రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం నగదు వసూలు చేస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తోంది. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రస్తుత గృహ అనుభవదారుడు ఎవరు? స్థలం, సరిహద్దులు గుర్తిస్తున్నారు. నిర్దేశించిన రుసుము చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
ఇక ఇవాళ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నేతలు కూడా ప్రత్యేకంగా జగన్కు ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు.