Sajjala Ramakrishna Reddy : జగన్ పాలనలో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది
ధాన్యం బకాయిలు, ధాన్యానికి మద్దతు ధర వంటి వ్యవసాయ అంశాలపై సీఎం జగన్ కు చంద్రబాబు రాసిన లేఖపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు.
- Naveen
- Published On : June 17, 2021 / 05:09 PM IST
Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy : ధాన్యం బకాయిలు, ధాన్యానికి మద్దతు ధర వంటి వ్యవసాయ అంశాలపై సీఎం జగన్ కు చంద్రబాబు రాసిన లేఖపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల పట్ల విపక్షానిది కపట ప్రేమ అని విమర్శించారు.
రైతుల సమస్యలపై చంద్రబాబు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీడీపీ హయాంలోని బకాయిలను కూడా తమ ప్రభుత్వమే తీర్చిందని, ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించాలని సజ్జల అన్నారు. బాబు హయాంలోని చీకటి రోజులను ప్రజలు ఇంకా మరిచిపోలేదని అన్నారు. సీఎం జగన్ కు చంద్రబాబు రాసిన లేఖలోని అంశాలన్నీ అవాస్తవాలే అని చెప్పారు.
సీఎం జగన్ పాలన రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు లాభసాటిగా ఉండాలని, రైతులు తమ సొంతకాళ్లపై నిలబడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సజ్జల చెప్పారు. ఆదాయపు పన్ను విషయంలో కూడా దుష్ప్రచారం చేస్తున్నారని.. కేంద్రం, 15వ ఆర్థిక సంఘం సూచనలనే అమలు చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.
ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాశారు. ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. మద్దతు ధరకు కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని లేఖలో తెలిపారు. రైతు ప్రభుత్వం అని చెప్పి.. వారిని నిండా ముంచే విధానాలు అవలంభిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమచేశామని గుర్తుచేశారు.
