Covid-19 : కోవిడ్ను జయించి లక్షలాది మంది సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళుతుంటే కొందరు మాత్రం మానసిక ధైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తనను చూడటానికి కుటుంబ సభ్యులెవరూ రావటం లేదనే కారణంతో విశాఖపట్నంలోని కేజీహెచ్ లో కోవిడ్ బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మేడపై నుంచి దూకుతుండగా సిబ్బంది చూసి ఆమెను అడ్డుకోవటంతో ప్రాణాలతో బయటపడింది.
కేజీహెచ్ లో ఒక మహిళ వారం రోజులుగా కోవిడ్ కు చికిత్స పొందుతోంది. అయితే తనను చూడటానికి కుటుంబ సభ్యులెవరూ రావటంలేదని మనస్తాపం చెంది ఇవాళ మహిళ ఆత్మహత్య కు ప్రయత్నించింది. తనకు కోవిడ్ తగ్గినా వైద్యులు ఇంకా డిశ్చార్జ్ చేయకపోవటం…ఇంట్లో వాళ్లెవరూ రాకపోవటంతో ఆ మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది.
ఈ రోజు మధ్యాహ్నం కిటికీలోంచి కిందకు దూకుతుంటే, పక్కనే బెడ్ మీద ఉన్న పేషెంట్ గట్టిగా కేకలువేయటంతో సిబ్బంది గమనించి ఆమె యత్నాన్ని అడ్డుకుని రక్షించారు. ఇదే బ్లాకులో ఇంతవరకు నలుగురు కోవిడ్ పేషెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు. కోవిడ్ సోకిన పేషెంట్లు ఎక్కువ మంది మానసిక ధైర్యం కోల్పోతున్నారు. ఈనేపధ్యంలో కోవిడ్ పేషెంట్లకు ధైర్యం చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వటానికి పలు ఆస్పత్రుల్లో మానసిక వైద్యులను ఏర్పాటు చేసి వారికి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు.