CPI Leader Narayana
Narayana Criticized BJP : పార్లమెంటులో కమ్యూనిస్టు బలం తగ్గడంతో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మణిపూర్ లో యాభై వేల ఎకరాల భూమిని బీజేపీ అదానికి అప్పగించిందని పేర్కొన్నారు. గిరిజనులను బ్లాక్ మెయిల్, అరాచకాలు చేసి లొంగ దీసుకుంటున్నారని విమర్శించారు. పోలీసుల సమక్షంలో కార్గెన్ వీరుడిగా ఉన్న ఓ నాయకుడి భార్య, కుమార్తెను అత్యాచారం చేసి చంపేశారని పేర్కొన్నారు.
సోమవారం తిరుపతిలోని పద్మావతిపురంలో ఏబీ బర్ధన్ కమ్యూనిటీ భవన్ ను నారాయణ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ కుట్రపూరితంగా మణిపూర్ ను మండిస్తోందని ఆరోపించారు. పార్లమెంటులో 24 మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. జగన్ బీజేపీతోనే కలిసి ఉన్నాడని పేర్కొన్నారు. పవన్, టీడీపీ కలిసి రాజకీయం చేయడం మొదలు పెట్టారని వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధికి రూ.50 కోట్లు ఇస్తానని చెప్పి కోటి రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
Freedom Fighter Wife: మణిపూర్ లో మరో దారుణం.. స్వాతంత్య్ర సమరయోధుడి భార్యను ఇంట్లో బంధించి సజీవ దహనం
పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ఏపీ ప్రజలకు బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించారు. పవన్, చంద్రబాబులు మునిగిన పడవలపై ఉన్నారని తెలిపారు. పవన్, చంద్రబాబులు రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబుకు తాము సపోర్ట్ చేయబోమని స్పష్టం చేశారు. బీజేపీతో ఉండాలని ఎవరు ప్రయత్నం చేసినా తెలుగు ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళే అవుతారని పేర్కొన్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే తమ మద్దతు ఎవరికి అనేది తెలుపుతామని చెప్పారు. కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా ముందు ఓటు వేసేది వైసీపీనేనని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో దొంగలు, అరాచకాలు, దౌర్జన్యం, మాఫియా పెరిగిపోతోందన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బాగా అభివృద్ధి చెందారని, కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారం చేశారని విమర్శించారు.