ఏపీలో కూరగా మారిపోతున్న గాడిదలు
- Subhan Ali Shaik
- Published On : February 25, 2021 / 07:12 AM IST
donkeys meat
Donkeys Meat: వాస్తవాలు తెలుసుకోకుండా.. వదంతులేమో అని కన్ఫామ్ కూడా చేసుకోకుండా మూగజీవులను చంపేస్తున్నారు. అనుమతుల్లేకున్నా గాడిదలను వధించి తినేస్తున్నారు. గుంటూరు, కర్నూలు, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో విరివిగా కనిపించిన గాడిదలు అంతరించిపోతున్న జంతువుల జాబితాలోకి వెళ్లిపోయేలా కనిపిస్తుంది.
పుకార్లు విని మాంసం కోసం విచ్చలవిడిగా వధిస్తున్నారు. ఈ మాంసం తింటే శరీర దారుఢ్యం పెరుగుతుందని, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని, లైంగిక శక్తి, వీర్య పుష్టి కలుగుతుందనే అపోహలు గాడిదల మనుగడకు శాపంగా మారాయి. ఈ నమ్మకాలతోనే గడిచిన కొన్నేళ్లుగా ఏపీలో పెద్దఎత్తున గాడిదలను వధిస్తున్నట్టు తెలుస్తోంది.
నిజానికి గాడిదలను చంపి తినడం నేరం. కానీ, ఆ మాంసానికి ఏపీలో పెరుగుతున్న డిమాండ్ ఆ మాటను మింగేస్తుంది. దీని దృష్ట్యా కొంతమంది వ్యాపారులు కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ర్టాల నుంచి అక్రమంగా ఏపీకి గాడిదలను తరలిస్తున్నారు. అంటే ఏపీలో గాడిదలు తగ్గిపోయాయని అర్థమవుతోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో వేల సంఖ్యలో ఉన్న గాడిదలు ప్రస్తుతం 5 వేలకు మించి కనపడటం లేదు.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో గాడిదలను కూడా జూలలో చూడాల్సిందే. వాటి మనగడకు ప్రమాదం ఉందని జంతు సంరక్షణ సంస్థ (ఎన్జీవో) కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతరించిపోతున్న గాడిద సంతతిని రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గాడిద పాలు, మాంసం వినియోగంపై ప్రజల్లో ఉన్న అపోహలు వీడాలని అధికారులు సూచిస్తున్నారు.
