టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ACB అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 2020, జూన్ 12వ తేదీ శుక్రవారం ఉదయం ఆయనను అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ కుంభకోణంపై గతంలోనే ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిదే. DIMS డైరెక్టర్ వాంగ్మూలంతో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. మందులు, పరికరాల కొనుగోలులో రూ. 151 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
కార్మిక శాఖ మంత్రిగా : –
చంద్రబాబు హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబు పాలనలోని అవినీతిపై విచారణకు ఆదేశించారు. అందులో కార్మిక శాఖలోని ESI స్కాం వెలుగు చూసింది. ఈ భారీ కుంభకోణాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బయటపెట్టింది. ఈ కుంభకోణంలో చంద్రబాబు రైట్ హ్యాండ్ అయిన నాటి మాజీ మంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఉందని దర్యాప్తులో తేలినట్టు సమాచారం.
టెలీ హెల్త్ సర్వీసుల పేరిట : –
నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్లో తేలింది. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని.. నామినేషన్ల పద్ధతిలో కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారని విచారణలో వెలుగులోకి వచ్చింది. దీంతో అవినీతి జరిగిందని ఇందులో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని గుర్తించిన అధికారులు ఈ ఉదయం ఆయనను అరెస్ట్ చేశారు.
గత ఆరేళ్లలో కోట్ల రూపాయల స్కాం : –
ఈఎస్ఐలో గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని.. లేని కంపెనీల నుంచి నకిలీ కోటేషన్లు తీసుకొని ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేట్ కాంట్రాక్ట్ లో లేని కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు 51 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో ఈఎస్ఐ డైరెక్టర్ ఇద్దరిని బాధ్యులుగా గుర్తించారు. మందులు పరికరాల వాస్తవ ధరకంటే 136 శాతం అధికంగా సంస్థలు టెండర్లు చూపించినట్టు విచారణలో తేలింది.
ఈ స్కామ్లో ఇప్పటికే ఒక డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. అతడు ఇచ్చిన ఆధారాల ప్రకారం అచ్చెన్నాయుడి పాత్ర బయటపడినట్లు సమాచారం. దీంతో ఈ ఉదయం ఆయనను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు.
2014-19 మధ్య నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి రూ.89.58 కోట్ల విలువైన మందుల కొనుగోలు చేసినట్లు, రూ.38.56 కోట్ల మందులకు రూ.89.58 కోట్ల చెల్లింపు..దీని ద్వారా ప్రభుత్వానికి 51.02 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. రూ.293.51 కోట్ల కొనుగోళ్లకు అనుమతి ఉండగా… రూ.698.36కోట్లతో కొనుగోళ్లు
నామినేషన్ పద్ధతిపై రూ.237 కోట్ల విలువైన ల్యాబ్ కిట్ల కొనుగోలు..మార్కెట్ ధర కంటే 36శాతం ఎక్కువ చెల్లించినట్లు గుర్తించారు. ల్యాబ్ కిట్ల కొనుగోలులో ప్రభుత్వానికి రూ.85.32కోట్ల నష్టం వాటిల్లిందని ఏసీబీ అంటోంది.
బాబు స్పందన : –
మరోవైపు అచ్చెన్నాయుడు అరెస్ట్పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అచ్చెన్నాయుడు కిడ్నాప్నకు జగన్ బాధ్యత వహించాలన్నారు. వందమంది పోలీసులు ఇంటిపై పడి అచ్చెన్నాయుడిని ఎత్తుకెళ్లారని ఆయన ఆరోపించారు. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా తీసుకెళ్లారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నాయుడిపై కక్ష సాధింపు చర్యలకు దిగారని చంద్రబాబు మండిపడ్డారు.
అచ్చెం నాయుడి పాత్ర ఉంది : –
అటు ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని ఏపీ కార్మికశాఖ మంత్రి జయరాం అన్నారు. వందల కోట్ల అవినీతి జరిగిందన్నారు. అచ్చెన్నాయుడు శాఖలో 150 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. తొందర్లోనే చంద్రబాబు, లోకేశ్ కూడా జైలుకు వెళ్తారని మంత్రి జయరాం అన్నారు. ఎవరు అవినీతికి పాల్పడినా శిక్ష తప్పదన్నారు.