Vijayawada
Father, Daughter Suicide : విజయవాడ తండ్రి, కూతుళ్లది ఆత్మహత్యా..? హత్యా..? కావాలనే వాళ్లను అడ్డు తొలగించారా..? ఇద్దరినీ చంపేసి డ్రామాకు తెరలేపారా..? ఇప్పుడివే ప్రశ్నలు విజయవాడ పోలీసులను వేదిస్తున్నాయి. ఇంట్లోనే తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మిస్టరీగా మారిందిప్పుడు. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి, కూతురు ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఓ తండ్రి తన కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య అనారోగ్యానికి గురైందనే మనస్తాపంతో భర్త జగాని రవి, తన పదేళ్ల కుమార్తెతో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో రవి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. అయితే గత కొంతకాలంగా రవి భార్య భరణి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఓ వైపు భార్య అనారోగ్యం, మరోవైపు ఇటీవలే తాను ఎంతగానో ఇష్టపడ నాన్నమ్మ మృతి చెందడంతో.. రవి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే రవి, అతని కూతురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు బంధువులు.
ఇక, ఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్ మాత్రం కన్నీరు పెట్టించేలా ఉంది. భార్య అనారోగ్యానికి గురైందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రవి సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. మరణించిన తర్వాత తమ అవయవాలను భార్య భరణికి ఇవ్వాలని అందులో కోరాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. అయితే.. మృతుడి కాళ్లు, చేతులు కట్టేయడం, నోటికి టేప్ వేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రవి, అతని కూతురు ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా వారిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా..? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.