మాజీమంత్రి బొత్స సత్యనారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో భాగంగా..
- Harish Thanniru
- Updated on- June 4, 2025 / 02:07 PM IST
Botsa Satyanarayana: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చీపురుపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం వేదికపై ఉండగా వడదెబ్బతో సొమ్మసిల్లిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను సహచరులు ఆస్పత్రికి తరలించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని పేర్కొంటూ ప్రజల తరపున వైసీపీ ఉద్యమబాట పట్టింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన ఇవాళ (జూన్ 4) ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
